
Indian Cricket Selection Controversy: రజత్ పటీదార్ కెరీర్లో అద్భుతమైన మలుపు తిరిగింది. ఐపీఎల్లో సత్తా చాటినా భారత టీ20 జట్టులో చోటు దక్కక తీవ్ర తీవ్ర నిరాశకు గురైన ఈ డాషింగ్ బ్యాటర్కు మళ్ళీ మహర్దశ పట్టింది. ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ కెప్టెన్గా పటీదార్ నియమితుడయ్యాడు.
ప్రతిభ ఉన్నా తప్పని నిర్లక్ష్యం.. అభిమానుల్లో వెల్లువెత్తిన ఆగ్రహం..
టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో, దక్కించుకున్న స్థానాన్ని కాపాడుకోవడం కూడా అంతే సవాలుతో కూడుకున్న విషయం. అయితే, దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న కొందరు ఆటగాళ్లను సెలెక్టర్లు వరుసగా పక్కన పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఆ జాబితాలో మొదటి వరుసలో ఉండే పేరు రజత్ పటీదార్. రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోనీల సరసన నిలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ అందించి 500కు పైగా పరుగులు చేసినా అతడిని జాతీయ టీ20 జట్టులోకి తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
నాయకుడిగా దండయాత్ర.. మళ్లీ పటీదార్కే పగ్గాలు..
నిరాశపరిచిన జాతీయ జట్టు ఎంపికను పక్కన పెడితే, స్టేట్ అసోసియేషన్ సెలెక్టర్లు మాత్రం పటీదార్ అసాధారణ నాయకత్వ పటిమపై పూర్తి నమ్మకాన్ని ఉంచారు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న సెంట్రల్ జోన్ జట్టును నడిపించే బాధ్యతను మరోసారి అతడికే అప్పగించారు. గత ఎడిషన్ దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ను మట్టికరిపించి టైటిల్ అందించిన పటీదార్, ఈసారి కూడా జట్టును విజేతగా నిలిపేందుకు సిద్ధమయ్యాడు. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనున్న ఈ టోర్నీలో పటీదార్ సారథ్యంలోని సెంట్రల్ జోన్ మరోసారి ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
బ్యాట్తో విధ్వంసం.. రికార్డుల రారాజు..
కెప్టెన్సీ మాత్రమే కాకుండా బ్యాటింగ్లోనూ పటీదార్ సృష్టించిన ప్రభంజనం అపూర్వం. గత దులీప్ ట్రోఫీ సీజన్లో కేవలం ఐదు ఇన్నింగ్స్ల్లోనే 76.40 అద్భుత సగటుతో ఏకంగా 382 పరుగులు సాధించాడు. ఇందులో రెండు భారీ శతకాలు, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. 96.95 స్ట్రైక్ రేట్తో రెడ్ బాల్ క్రికెట్లో కూడా పరిమిత ఓవర్ల మ్యాచ్ను తలపించేలా వేగంగా పరుగులు సాధించడం అతడి ప్రత్యేకత.
విరాట్ కోహ్లీ సహచరుడికి రింకూ సింగ్ సపోర్ట్..
ప్రకటించిన 15 మంది సభ్యుల సెంట్రల్ జోన్ జట్టులో బలమైన ఆటగాళ్లకు చోటు దక్కింది. పటీదార్కు డిప్యూటీగా, వైస్ కెప్టెన్గా విస్ఫోటక బ్యాటర్ రింకూ సింగ్ను ఎంపిక చేశారు. ఆర్యన్ జుయాల్, సారాంశ్ జైన్, యష్ రాథోడ్, యష్ ఠాకూర్ లాంటి యువ రత్నాలు జట్టులో ఉన్నారు. ఈ జట్టు రజత్ పటీదార్ నాయకత్వంలో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సమాయత్తమవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..