తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు TSLPRB కీలక అప్డేట్ జారీ చేసింది. హోంశాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో 7,437 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించింది. అభ్యర్థులు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని మండలి వెల్లడించింది. పోలీస్ శాఖతో పాటు ఇతర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం టీఎస్ఎల్పీఆర్బీ నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసింది. పోలీస్ శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు అధికంగా ఉన్నాయి. ఎస్సై స్థాయి పోస్టులతో పాటు ఇతర సమాన స్థాయి పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.
తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు
అభ్యర్థులు టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు నోటిఫికేషన్లో సూచించిన విధానంలోనే దరఖాస్తు ఫారమ్ను పూర్తి చేయాలని నియామక బోర్డు స్పష్టం చేసింది. ఎస్సై పోస్టులకు దరఖాస్తు రుసుం కింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.750, ఇతర అభ్యర్థులు రూ.1,500 చొప్పున చెల్లించాలి. కానిస్టేబుల్, సమాన స్థాయి పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600, ఇతర అభ్యర్థులు రూ.1,200 చొప్పున చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియలో పార్ట్-1 నమోదు సమయంలో ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అవసరం ఉంటుందని టీఎస్ఎల్పీఆర్బీ ఛైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. అందువల్ల అభ్యర్థులు ముందుగానే ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణలో పోలీస్ విభాగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపడుతుండటంతో నిరుద్యోగ యువతలో ఆసక్తి పెరిగింది. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల ఆగస్టు 19, 2026 నుంచి ప్రారంభం అవుతాయి. సెప్టెంబర్ 9, 2026 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్లో అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచించారు.