జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంతనాగ్ పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన లాల్ చౌక్ సమీపంలో జరిగిన కాల్పుల్లో ఐఆర్ 3వ బెటాలియన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ అమరుడయ్యారు. బుధవారం (జూలై 22) మధ్యాహ్నం సుమారు 12:35 గంటల సమయంలో కోత్వాల్ గలి ప్రాంతంలో విధుల్లో ఉన్న పోలీసు బృందాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆషిక్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందగా, దాడి అనంతరం ఉగ్రవాదులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న భద్రతా దళాలు వెంటనే ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి, ఉగ్రవాదుల కోసం విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. లాల్ చౌక్ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, వాహనాలు, పాదచారులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఉగ్రదాడికి లష్కర్-ఎ-తైబా అనుబంధ సంస్థగా భావించే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అమరుడైన హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ అమర్నాథ్ యాత్ర భద్రతా విధుల్లో భాగంగా పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భద్రతా వ్యవస్థను మరింత అప్రమత్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం 2019లో ఏర్పడిన టీఆర్ఎఫ్, జమ్మూ కాశ్మీర్లో పలువురు భద్రతా సిబ్బందిపై జరిగిన దాడుల్లో తన పాత్రను ప్రకటిస్తూ వస్తోంది. ఈ సంస్థను లష్కర్-ఎ-తైబాకు ప్రాక్సీ సంస్థగా భద్రతా సంస్థలు పరిగణిస్తున్నాయి.
ఇటీవల కూడా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగినట్లు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించగా, భద్రతా దళాలు వారిని అడ్డుకుని కాల్పులు జరిపాయి. అలాగే షోపియాన్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో లష్కర్-ఎ-తైబా అగ్రశ్రేణి కమాండర్ జాకిర్ గనాయ్ను భద్రతా దళాలు హతమార్చాయి. తాజా అనంతనాగ్ దాడి నేపథ్యంలో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా నిఘాను కట్టుదిట్టం చేశాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..