Headlines

Andhra: కొండపై ఏదో తచ్చాడుతూ కనిపించింది.. ఏంటా అని కెమెరాలో జూమ్ చేసి చూడగా..


Andhra: కొండపై ఏదో తచ్చాడుతూ కనిపించింది.. ఏంటా అని కెమెరాలో జూమ్ చేసి చూడగా..

అంతరించిపోతున్న జీవజాతులలో ఒకటైన అరుదైన పునుగుపిల్లి మంగళగిరి ప్రాంతంలో సంచరిస్తూ కనిపించడం స్థానికులు, పర్యావరణవేత్తలలో ఆసక్తిని రేకెత్తించింది. సాధారణంగా తిరుమల కొండ పరిసరాల్లో అరుదుగా దర్శనమిచ్చే ఈ వన్యజీవి.. మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొండపై ఉన్న ఓ గుహలో ప్రత్యక్షమైంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన కొంతమంది దీనిని గుర్తించి కెమెరాల్లో బంధించారు. అనంతరం వీడియోను అటవీ శాఖ అధికారులకు పంపించి సమాచారం అందించారు.

అటవీ శాఖ అధికారుల ప్రకారం.. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కొంతకాలంగా పునుగుపిల్లుల సంచారం పెరిగింది. మంగళగిరి కొండపై పచ్చదనం బాగా పెరగడంతోపాటు అక్కడక్కడ నీటి కుంటలు ఏర్పడటం వల్ల ఆహారం, నీటి కోసం ఈ అరుదైన జీవులు ఈ ప్రాంతానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పునుగుపిల్లి జీవవైవిధ్యంలో కీలకమైన జంతువుగా పరిగణిస్తారు. ఇది ప్రధానంగా రాత్రివేళల్లో సంచరిస్తూ చిన్న జంతువులు, కీటకాలు, పండ్లు తదితరాలను ఆహారంగా తీసుకుంటుంది. ప్రకృతి వ్యవస్థలో ఆహార గొలుసులో భాగంగా ఉండటంతోపాటు.. ఒక ప్రాంతంలో ఇలాంటి వన్యజీవుల ఉనికి అక్కడి పర్యావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనడానికి సంకేతంగా పర్యావరణవేత్తలు చెబుతున్నారు. పునుగుపిల్లి నివాస ప్రాంతాలను కాపాడటం ద్వారా స్థానిక జీవవైవిధ్యాన్ని పరిరక్షించవచ్చని వారు పేర్కొంటున్నారు.

ఈ అరుదైన జీవిని సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. మంగళగిరి కొండపై పునుగుపిల్లి ప్రత్యక్షం కావడం.. ఈ ప్రాంతంలో పచ్చదనం, నీటి వనరులు పెరుగుతున్నాయనడానికి, జీవవైవిధ్యం మెరుగుపడుతున్నదానికి శుభసూచకంగా పర్యావరణవేత్తలు అభివర్ణిస్తున్నారు.

వీడియో దిగువన చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *