కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI) 2.0 నివేదికలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మిశ్రమ ఫలితాలను సాధించింది. ఓవరాల్ నేషనల్ ర్యాంకింగ్స్లో తెలంగాణ గణనీయమైన పురోగతిని సాధించి, గతంలో ఉన్న స్థానం నుంచి ఏకంగా 18వ స్థానానికి చేరింది. మొత్తం 1000 పాయింట్లకు గాను 599.7 స్కోరు సాధించి ప్రచేష్ట-3 బ్యాండ్లో నిలిచింది. స్కూళ్లకు విద్యార్థుల రాక , అడ్మిషన్ల ప్రక్రియలో సాధించిన ప్రగతి వల్లనే రాష్ట్రం ఓవరాల్ ర్యాంకింగ్లో పైకి ఎగబాకినట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
అయితే ర్యాంక్ మెరుగైనప్పటికీ అసలైన చదువుల నాణ్యతలో మాత్రం తెలంగాణ ఘోరంగా విఫలమైంది. విద్యార్థుల సామర్థ్యం, అధ్యయన ఫలితాలు.. అంటే లెర్నింగ్ ఔట్ కమ్ విభాగంలో రాష్ట్రం అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచింది. ఈ విభాగానికి కేటాయించిన 240 మార్కులకు గాను తెలంగాణ కేవలం 69 మార్కులు (28.8%) మాత్రమే సాధించి, జాతీయ స్థాయిలో 26వ స్థానంలో నిలిచింది. తరగతి గదిలో బోధన, విద్యార్థుల్లో కనీస అక్షరాస్యత మరియు సంఖ్యా శాస్త్ర సామర్థ్యాలు ఇంకా తీవ్ర ఆందోళనకరంగానే ఉన్నాయని ఈ అంకెలు తేటతెల్లం చేస్తున్నాయి.
మరోవైపు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కూడా విద్యాశాఖను వేధిస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో కేటాయించిన 190 మార్కులకు 91.9 మార్కులు సాధించి రాష్ట్రం 20వ స్థానంలో నిలిచింది. పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ తాగునీరు, సరైన శౌచాలయాలు, కంప్యూటర్ ల్యాబ్లు, లైబ్రరీల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం ఓవరాల్ ర్యాంకింగ్పై మాత్రమే దృష్టి పెట్టకుండా, నాణ్యమైన విద్యనందించడంతో పాటు టీచర్ల శిక్షణ, మౌలిక వసతుల కల్పనపై విద్యాశాఖ తక్షణమే ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.