తగ్గేదేలే అంటున్న ఆర్టీసీ జేఏసీ.. విలీనం అయ్యేదాకా వదిలే ప్రసక్తే లేదన్న నేతలు.. కదలని బస్సులు!

తగ్గేదేలే అంటున్న ఆర్టీసీ జేఏసీ.. విలీనం అయ్యేదాకా వదిలే ప్రసక్తే లేదన్న నేతలు.. కదలని బస్సులు!


తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో, కార్మికులు తమ నిరసనను ఉధృతం చేశారు. ముందుగా ప్రకటించినట్లే తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (JAC) సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ప్రభుత్వం, జేఏసీ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.

నిన్న అంటే మంగళవారం (ఏప్రిల్ 21) రాత్రి ప్రభుత్వ కమిటీతో జరిగిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. సమస్యల పరిష్కారానికి అధికారులు 4 వారాల సమయం కోరగా, దీనిని జేఏసీ ఖరాఖండిగా తిరస్కరించింది. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, గత్యంతరం లేకే సమ్మెకు వెళ్తున్నామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. “మేము కొత్త కోర్కెలేవీ కోరడం లేదు, కేవలం ప్రభుత్వ మేనిఫెస్టోలో ఉన్న హామీలనే అమలు చేయమంటున్నాము” అని జేఏసీ వైస్‌చైర్మన్‌ థామస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ‘ఎస్మా’ (ESMA) ప్రయోగించి తమను భయపెట్టాలని చూస్తోందని, అయితే ఎటువంటి బెదిరింపులకు లొంగబోమని కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

జేఏసీ ప్రభుత్వం ముందు మొత్తం 32 డిమాండ్లను ఉంచింది. వాటిలో ప్రధాన డిమాండ్లు ఇవే:

  1. విలీనం: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.
  2. వేతన సవరణ: 30% ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలి.
  3. ఉద్యోగ భద్రత: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్, బెనిఫిట్స్ అందించాలి.
  4. బకాయిల విడుదల: పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలి.
  5. మహాలక్ష్మి పథకం: ఉచిత బస్సు ప్రయాణ పథకానికి నెలకు రూ. 350 కోట్లు కేటాయించాలి.
  6. ప్రైవేటీకరణ నిరోధం: హైదరాబాద్‌ జోన్‌లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను అనుమతించకూడదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *