
ఆ రోజు జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ గుండెలో దడ పుడుతోంది. పహల్గామ్లోని బైసరన్ లోయలో పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలు దిగుతుండగా, ఒక్కసారిగా అక్కడికి చొరబడ్డ పాక్ ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ముఖ్యంగా హిందువులనే లక్ష్యంగా చేసుకున్నారు. ప్రాణాల కోసం పరుగులు తీసిన ప్రజలు, కేకలు వేసిన చిన్నారులు, కుటుంబ సభ్యుల కోసం వెతికిన వారు.. ఆ సమయంలో ఆ ప్రాంతం యుద్ధభూమిని తలపించింది. ఈ దుర్ఘటన జరిగి ఏడాదైంది. మరి ఇప్పుడు అక్కడి పరిస్థితి ఎలా ఉంది?
ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో శుభం ద్వివేది కూడా ఒకరు. ఆయన భార్య ఐశాన్య ద్వివేది ఇప్పటికీ ఆ విషాదం నుంచి పూర్తిగా బయటపడలేకపోతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు గుండెను పిండేస్తాయి. “మేమిద్దరం కలిసి ఉన్న గదిలో అద్దం ఉండేది కాదు. నేను అడిగిన తర్వాత మరుసటి రోజే ఆయన దాన్ని తీసుకువచ్చి అమర్చారు. ఇప్పుడు ఆ అద్దం కనిపిస్తే ఆయన జ్ఞాపకం వెంటాడుతుంది” అని ఆమె కన్నీటి కళ్లతో చెప్పారు. ఈ ఒక్క కుటుంబం మాత్రమే కాదు, ఆ 26 కుటుంబాల జీవితాలు ఒక్క క్షణంలో మారిపోయాయి.
ఈ ఘటన కేవలం ఒక ఉగ్రదాడి మాత్రమే కాదు, కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. పర్యాటక రంగంపై ఆధారపడే స్థానిక ప్రజల జీవితం దెబ్బతింది. గతంలో పర్యాటకులతో కళకళలాడిన హోటళ్లు, గుర్రపు స్వారీ సేవలు, స్థానిక దుకాణాలు, టూరిస్ట్ గైడ్లు.. ఇవన్నీ ఒకేసారి ఆదాయం కోల్పోయాయి. భయంతో పర్యాటకులు రాక తగ్గడంతో అనేక కుటుంబాలు ఆర్థిక కష్టాల్లోకి వెళ్లిపోయాయి.
ఈ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం “ఆపరేషన్ సిందూర్” పేరుతో అటాక్ చేసింది. ఉగ్రవాదుల క్యాంపులను నేలమట్టం చేయడంతో పాటు, దాదాపు 100 మందికి పైగా ముష్కరులను హతమార్చినట్లు భద్రతా వర్గాలు ప్రకటించాయి. ముఖ్యంగా జైషే మహమ్మద్కు అది పెద్ద దెబ్బ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.