కరీంనగర్ నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో ప్రమాద ఘటన చోటుచేసుకుంది. చీకటి, వర్షం కారణంగా ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సహాయం కోసం ఆమె చేసిన అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే స్పందించి నాలా నుంచి బయటకు తీశారు. గాయపడ్డ వృద్ధురాలిని సమీప ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో నాలాను సరిగా మూసివేయకుండా వదిలేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. రాత్రి వేళల్లో వెలుతురు లేకపోవడం, వర్షపు నీటితో గుంతలు కనిపించకపోవడం వల్ల ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయింది. బయటకు రావడానికి ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో చాలా సేపు నరకయాతన అనుభవించింది. ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర శ్రమ తర్వాత ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనతో నిర్మాణ పనుల నిర్వహణ, భద్రతా చర్యలపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కనీస భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రమాదకరంగా ఉన్న నాలాలను వెంటనే కప్పివేయాలని అధికారులను కోరుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..