పానీపూరి పేరు వింటేనే నోరూరని వారు ఉండరు. కానీ జార్ఖండ్లో జరిగిన ఒక తాజా సంఘటన పానీపూరి ప్రియులను భయాందోళనకు గురిచేస్తోంది. జార్ఖండ్లో పానీపూరి తిని ఒకేసారి 45 మంది అనారోగ్యం పాలవ్వడం స్థానికంగా కలకలం రేపింది. ఒకే ప్రాంతంలో పానీపూరి తిన్న 45 మందికి పైగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. వారందరూ అధిక జ్వరం , కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. చికిత్స పొందుతూ 6 ఏళ్ల బాలుడు మరణించాడు. ఈ సంఘటన, వేసవిలో పానీపూరి తినడం సురక్షితమేనా, లేదా అది మన ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందా అనే ప్రశ్నను మనలో రేకెత్తిస్తోంది. వేసవి కాలంలో ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతాయి? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
వేసవిలో ఎందుకు ప్రమాదం?:
ఎండల తీవ్రత వల్ల వాతావరణంలో బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తుంది. పానీపూరి బండి వద్ద వాడే నీరు చాలా గంటల పాటు బయటే ఉంటుంది. ఒకవేళ ఆ నీరు కలుషితమైనా లేదా అందులో వాడే చింతపండు, మసాలాలు పాడైపోయినా అవి నేరుగా మన జీర్ణవ్యవస్థపై దాడి చేస్తాయి. దీన్నే ఫుడ్ పాయిజనింగ్ అంటారు.
పానీపూరి నీటి తయారీలో అపరిశుభ్రమైన నీటిని వాడితే టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. వేసవిలో ఇప్పటికే శరీరం నీటిని కోల్పోతుంది. దీనికి తోడు ఫుడ్ పాయిజనింగ్ వల్ల వాంతులు, విరేచనాలు అయితే శరీరం తీవ్రమైన డీహైడ్రేషన్కు గురై ప్రాణాపాయ స్థితికి చేరుకోవచ్చు. కొందరు వ్యాపారులు ఉడకబెట్టిన బంగాళదుంపలను లేదా శనగలను మరుసటి రోజు కూడా వాడుతుంటారు. వేడికి ఇవి త్వరగా కుళ్ళిపోయి విషపూరితంగా మారుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వేసవిలో వీధి ఆహారానికి దూరంగా ఉండటం లేదా ఇంట్లోనే పరిశుభ్రంగా తయారు చేసుకుని తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఏదైనా ఆహారం తిన్న తర్వాత అస్వస్థతగా అనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..