
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్ లో “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సహా జిల్లా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపాదిత “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” భవనం ప్లాన్ను వీక్షించిన సీఎం… నాణ్యతలో రాజీపడొద్దని అధికారులు సూచించారు. భూమి పూజ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం… ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
తమను కూడా ఫ్యూచర్ సిటీలో కలపాలని.. పలు గ్రామాలు విజ్ఞప్తి చేస్తున్నాయన్న సీఎం.. ఆ దిశగా కసరత్తు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. గ్రామసభల ద్వారా తీర్మానం చేయించి.. వారి కోరిక ప్రకారం కొత్త కమిషనరేట్లో కలిసేలా చూడాలని ఆదేశించారు. సింగపూర్, టోక్యో, న్యూయార్క్ తరహాలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు రేవంత్రెడ్డి. ఒక్కొక్కటిగా వసతుల కల్పనలో ముందుకు వెళ్తున్నామన్నారు. జూన్ 2 లోగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఇక నుంచి ఫ్యూచర్ సిటీకి సంబంధించి .. ఆ భవనం నుంచే సమీక్షలు నిర్వహించి పెట్టుబడులను ఆహ్వానిస్తామన్నారు రేవంత్.
ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామన్నారు రేవంత్. ఆ దిశగా రంగారెడ్డి జిల్లాలో అద్భుతం జరగబోతుందని చెప్పారు. తనపై నమ్మకంతో రైతులు భూములిచ్చి.. ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కొత్త నగరం కోసం సహకారం అందించేవారు.. చరిత్రలో నిలిచిపోతారన్న సీఎం… భూములిచ్చిన రైతుల్ని ఆదుకునే బాధ్యత తనదని చెప్పారు. గతంలో కాలుష్యకారక ఫార్మా సిటీని వ్యతిరేకించి.. భవిష్యత్ నగరాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చానన్నారు సీఎం. స్థానిక రైతుల పిల్లలకు స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇచ్చి.. మంచి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..