వానొచ్చేసిందోయ్.. వరదొచ్చేసింది.. అంటూ హుషారుగా గంతులేస్తున్నారు తెలుగు రాష్ట్రాల రైతులు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి.. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండగా.. ఏపీలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో రెండు రోజులుగా ముసురులో నానుతోంది. ఈ క్రమంలోనే.. శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వాయుగుండం రాబోయే 24 గంటల్లో విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
దీని ప్రభావంతో శుక్రవారం (31-07-2026) మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు పడుతుండగా.. ఇప్పుడు మరోసారి వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. హైదరాబాద్, నిజామాబాద్, కరీంగనగర్, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ జిల్లాలకు నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో శుక్రవారం భారీ నుంచి అత్యంత భారీ వర్షాల రాష్ట్రంలో కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 40నుంచి60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో భారీ వర్షాలకు ట్రాఫిక్, విద్యుత్, తాగునీటి సరఫరాపై ఎలాంటి ఇబ్బంది పడకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.




