ఇథనాల్ బ్లెండింగ్.. ఈ 20 పెట్రోల్ వాడకంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఈ20 వాడడం వల్ల వాహనాల ఇంజన్లు పాడవుతాయని జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది. శాస్త్రీయ ఆధారాలు, కోట్లాది వాహనాల డేటాను పరిశీలించిన తర్వాత ఈ20 వాడడం వల్ల వాహనాల ఇంజన్లకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. అయితే 2023 కంటే ముందు వాహనాలు ఈ 20 పెట్రోల్ వాడకానికి పనికిరావని దానిపై కూడా క్లారిటీ ఇచ్చింది.
గత రెండున్నరేళ్లుగా దేశంలో E19-E20 పెట్రోల్ వినియోగంలో ఉందని.. ఈ కాలంలో ఏ ఒక్క వాహనం కూడా ఇథనాల్ వల్ల ఇంజిన్ పాడైనట్లు ప్రామాణికంగా నిరూపితం కాలేదని తెలిపింది. దేశంలో ప్రతిరోజూ దాదాపు 8 కోట్ల వాహనాలు పెట్రోల్ బంకులకు వస్తున్నాయని.. ఇప్పటివరకు 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా కార్లు ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్తోనే విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపింది. మారుతీ సుజుకి కంపెనీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో సర్వీస్ చేసిన 2.84 కోట్ల వాహనాల డేటాను పరిశీలించగా, అందులో E20 సర్టిఫై చేయబడని 1.5 కోట్ల పాత వాహనాల్లో ఎలాంటి ఇంజిన్ తుప్పు పట్టడం లేదా భాగాలు అరిగిపోవడం జరగలేదని స్పష్టమైందని పేర్కొంది.
అయితే ఈ20 వాడడం వల్ల కొన్ని పాత వాహనాల్లో మైలేజ్ తగ్గినా అది కేవలం 3 నుండి 5 శాతం మాత్రమేనని తెలిపింది. మైలేజ్ అనేది కేవలం ఇంధనం పైనే ఆధారపడి ఉండదని.. మన డ్రైవింగ్ విధానం, రోడ్డు ట్రాఫిక్, టైర్ల గాలి ఒత్తిడి , వాహన నిర్వహణపై కూడా ఆధారపడి ఉంటుందని తెలిపారు. మైలేజ్ తగ్గడానికి కేవలం ఈ పెట్రోల్ వాడకం మాత్రమే కారణం అనడం కరెక్ట్ కాదని తెలిపింది. E20 వల్ల అధిక ఆక్టేన్ రేటింగ్, స్మూత్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్, మెరుగైన ఆక్సిలరేషన్, తక్కువ కాలుష్యం వంటి అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలిపింది.
ఈ 20 ఇందన వాడకం కొన్ని ఆటోమొబైల్ సంస్థలకు ఇష్టం లేదని.. ప్రభుత్వం వారిపై ఒత్తిడి తెస్తోందనే ప్రచారాన్ని సైతం కేంద్ర కొట్టిపడేసింది. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని.. టయోటా, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, హ్యుందాయ్, టీవీఎస్, బజాజ్ ఆటో వంటి దిగ్గజ సంస్థలు సైతం మీడియా సమావేశం పెట్టి E20 ఇంధన వాడకానికి పూర్తి సపోర్ట్ ఇస్తున్నట్టు తెలిపాయని పేర్కొంది. అంతర్జాతీయ UNECE ప్రమాణాల ప్రకారం కఠినమైన పరీక్షలు నిర్వహించిన తర్వాతే E20ని ప్రవేశపెట్టామని.. E20 వాడే వాహనాలకు ఆయా కంపెనీలు వారంటీని కూడా యథావిధిగా అందిస్తాయని తెలిపింది.
మన దేశంలో పెట్రోల్లో ఇథనాల్ కలపడం కొత్తదేమీ కాదని.. 2013-14లో ఉన్న 1.53 శాతంగా ఉన్న ఇథనాల్ శాతాన్ని దశలవారీగా పెంచుతూ 2025-26 నాటికి 20శాతానికి స్థాయికి చేర్చామని. చమురు విక్రయ సంస్థలు దేశ వ్యాప్తంగా 30,000 కంటే ఎక్కువ రిటైల్ అవుట్లెట్లలో నాణ్యతా తనిఖీలు నిర్వహిస్తూ, BIS ప్రమాణాలకు కట్టుబడి ఇంధనాన్ని సరఫరా చేస్తున్నాయని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో జరిగే అనవసరమైన పుకార్లను ఎవరూ నమ్మవద్దని.. E20 ఇంధనం సురక్షితమైన, పర్యావరణహితమైనదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

As Seen From The Table,the Progression Has Been Gradual
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.