Virat Kohli : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఒక అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. నేడు (ఏప్రిల్ 15) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరగనున్న 23వ మ్యాచ్ కోహ్లీకి అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్లో కోహ్లీ కేవలం రెండు సిక్సర్లు బాదితే, ఐపీఎల్ చరిత్రలో 300 సిక్సర్లు పూర్తి చేసిన మూడో బ్యాటర్గా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఈ ఘనత కేవలం యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, హిట్మ్యాన్ రోహిత్ శర్మలకు మాత్రమే సాధ్యమైంది.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ రికార్డుల ప్రకారం.. అతను ఇప్పటివరకు 271 మ్యాచ్ల్లో 263 ఇన్నింగ్స్లు ఆడి మొత్తం 298 సిక్సర్లు నమోదు చేశాడు. క్రిస్ గెయిల్ 141 ఇన్నింగ్స్లలోనే 357 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 271 ఇన్నింగ్స్లలో 310 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు కోహ్లీ తన 264వ ఇన్నింగ్స్లోనే 300 మార్కును తాకే అవకాశం ఉంది. ఒకవేళ నేటి మ్యాచ్లో విరాట్ రెండు సిక్సర్లు కొడితే, ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా రోహిత్ పక్కన నిలుస్తాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం విరాట్ కోహ్లీకి అచ్చొచ్చిన మైదానం. ఇక్కడి బౌండరీలు చిన్నవిగా ఉండటం, పిచ్ బ్యాటింగ్కు అనుకూలించడంతో కోహ్లీ సిక్సర్ల వేట సులభం కావచ్చు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని చూస్తుంటే, కోహ్లీ వ్యక్తిగత రికార్డులు కూడా జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. విరాట్ కోహ్లీ ప్రస్తుత సీజన్లో సగటున 59.67తో పరుగులు చేస్తున్నాడు, ఇది అతనిపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తోంది.
లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే ఈ పోరులో మొహమ్మద్ షమీ, మయాంక్ యాదవ్ వంటి బౌలర్లను కోహ్లీ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఇప్పటికే రికార్డు సృష్టించిన కోహ్లీ, ఇప్పుడు సిక్సర్ల విషయంలో కూడా తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తున్నాడు. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు కింగ్ కోహ్లీ సిక్సర్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..