అత్తింటి వేధింపులకు ఆడపిల్లలు బలైన సంఘటనలు ఎన్నో చూశాం. పెళ్లి అనే పేరుతో అత్తవారింట్లో అడుగుపెట్టి వరకట్నం అని.. మగ పిల్లాడిని కనివ్వాలని.. సరిగ్గా పని చేయడం లేదని.. ఇలా వివిధ కారణాలతో మహిళలను వేధించడం తరతరాలుగా చూస్తున్నదే. అయితే తాజాగా జరిగిన ఈ సంఘటనలో ట్విస్ట్ ఏంటంటే.. అత్తింటి వేధింపులు తాళలేక ఓ పురుషుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు ఓ సెల్ఫీ వీడియో కూడా రికార్డు చేశాడు. అత్తారింటి వేధింపులు మహిళలకే కాదు.. పురుషులను కూడా చావు అంచుల వరకు తీసుకెళ్తుందని ఈ ఘటన తెలియజేస్తుంది. మరి ఈ విషాద ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భార్య, అత్తవారి వేధింపులు భరించలేక సయ్యద్ గౌస్ అనే వ్యక్తి బొద్దింకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ నగరం పాతబస్తీ ప్రాంత పరిధి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్ ప్రాంతంలోని రజా ఇలాహీ మసీదు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆ వ్యక్తి ఒక వీడియో కూడా రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో తన మరణానికి గల పూర్తి కారణాలను వివరించాడు. అత్తింటివారి వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యారని, ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ వ్యక్తి చెప్పడం గమనార్హం.
సయ్యద్ గౌస్ ఆత్మహత్యకు ముందు రికార్డు చేసుకున్న వీడియో ఇప్పుడు పలువురిని ఆలోచింపజేస్తుంది. ఆ వీడియోలో తన ఆవేదన అంతా వెళ్లగక్కుతూ గౌస్ చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. కుటుంబ గొడవల్లో ఓ వ్యక్తి ఇంతలా డిప్రెషన్కి లోనవుతారా అనేలా ఆ వీడియో ఉంది. సయ్యద్ గౌస్ వీడియోలో చెప్పిన మాటల ప్రకారం.. తన భార్య యాస్మిన్, అత్త తనను తీవ్రంగా వేధిస్తున్నారని పేర్కొన్నాడు. కుటుంబ గొడవల కారణంగా 9 నెలలుగా అత్తవారింటికి దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. తనకు యాస్మిన్ అనే యువతితో వివాహం జరిగి 12 ఏళ్లు గడిచిందని.. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత గొడవలు పెద్దవయ్యాయని.. ఇప్పుడు తాను కట్టుకున్న భార్య, అత్తగారే తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తల్లి బీపీ, షుగర్ పేషేంట్ అని.. ఈ వయసులో అమ్మని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి తానే కుటుంబ సమస్యలతో బాధ పడుతున్నట్లు చెప్పాడు. అందుకే అమ్మ కంటే ముందే తానే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. తాను చనిపోయాక పిల్లల బాధ్యతని సోదరుడు చూసుకోవాలని సయ్యద్ గౌస్ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ సెల్ఫీ వీడియో ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపింది.
ఇప్పటివరకు సాధారణంగా ఆడవాళ్లనే అత్తింటి వేధింపులకు బలవుతుండడం చూశామని.. అలాంటిది భర్తని భార్య, అత్త కలిసి ఇంతలా టార్చర్ చేశారని వినడం షాకింగ్ గా ఉందని ఈ ఘటన గురించి తెలుసుకున్నవాళ్ళు అంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు ముందు ఆ వ్యక్తి రికార్డు చేసిన వీడియోను ముఖ్య ఆధారంగా పరిశీలిస్తున్నారు. అయితే..ఇది నిజంగా కుటుంబ కలహాల ఫలితమేనా? లేక ఈ ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా? అనేది దర్యాప్తు పూర్తయ్యాకే స్పష్టత రానుంది.