Team India Oldest Debutant: ప్రస్తుతం టీమిండియాలో యువ ఆటగాళ్లకే పెద్దపీట వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీసీసీఐ తీసుకున్న ఓ అనూహ్య నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో 33 ఏళ్ల సారాంశ్ జైన్కు అవకాశం కల్పించింది. అయితే ఇంత పెద్ద వయసులో అరంగేట్రం చేస్తున్న సారాంశ్, భారత్ తరపున అత్యంత పెద్ద వయస్కుడైన అరంగేట్ర ఆటగాడా అంటే కాదనే చెప్పాలి.
ప్రస్తుతం భారత జట్టు యాజమాన్యం తమ భవిష్యత్తు ప్రణాళికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. రాబోయే 2028 టీ20 ప్రపంచ కప్ టోర్నీ కోసం ఇప్పటి నుంచే యువ రక్తాన్ని జట్టులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదే క్రమంలో వయసు మీద పడుతున్న సీనియర్ ఆటగాళ్లను జట్టు నుంచి మెల్లగా పక్కన పెడుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చేతిలోంచి కెప్టెన్సీ బాధ్యతలను లాగేసుకుని జట్టులోంచి పూర్తిగా తప్పించారు. అటు అద్భుతమైన ఫామ్లో ఉన్న సంజూ శాంసన్ స్థానంలో యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇస్తున్నారు. కేవలం వీరు మాత్రమే కాకుండా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ఆటగాళ్లపై కూడా తమ పెరుగుతున్న వయసు రిత్యా తీవ్ర స్థాయిలోనే ఒత్తిడి నెలకొంది. ఇలా సీనియర్లను పక్కనపెడుతూ యువకులకు పట్టం కడుతున్న ఈ తరుణంలో ఒక సీనియర్ ఆటగాడికి అనూహ్యంగా పిలుపు రావడం క్రీడా వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
ఇది కూడా చదవండి: ఆ నలుగురు చెత్త ఫీల్డర్లను పీకేయండి.. ఇంకెన్నాళ్లు దాచిపెడతారు..: బీసీసీఐపై గవాస్కర్ ఫైర్..!
ఇవి కూడా చదవండి
సారాంశ్ జైన్ ఎంపిక వెనుక అసలు కథ ఇదే..
బీసీసీఐ జూలై 28 మంగళవారం నాడు శ్రీలంక టూర్కు వెళ్లే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ శ్రీలంక పర్యటనలో భారత జట్టు ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కోసమే మధ్యప్రదేశ్కు చెందిన స్టార్ ఆల్ రౌండర్ సారాంశ్ జైన్ను ఎంపిక చేశారు. నిజానికి ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ ఆడుతున్న సమయంలో మరో స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తీవ్రమైన తొడ కండరాల గాయానికి గురయ్యాడు. అతడు ఇంకా కోలుకోకపోవడంతో ఈ పర్యటనలో జరిగే తొలి టెస్టు మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయాడు. సుందర్ స్థానాన్ని సరైన ఆటగాడితో భర్తీ చేసేందుకు అచ్చం అతడిలాగే ఆడే సారాంశ్ జైన్ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపారు. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న సారాంశ్, ఇటీవల ఇండియా-ఏ తరఫున శ్రీలంక పర్యటనలో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
శ్రీలంకతో తొలి టెస్టులో ఛాన్స్ దక్కేనా?
ఆగస్టు 15వ తేదీ నుంచి గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా శ్రీలంకతో తొలి టెస్ట్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం శ్రీలంక బ్యాటింగ్ లైనప్ను నిశితంగా పరిశీలిస్తే అందులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. ఈ ఒక్క బలమైన కారణంతో సారాంశ్ జైన్కు తుది జట్టులో ఆడే అవకాశం దక్కే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. ఒకవేళ అతడు తుది జట్టులో స్థానం సంపాదించి 33 ఏళ్ల వయసులో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసినా, భారత్ తరఫున ఆ రికార్డు సృష్టించిన అతి పెద్ద వయస్కుడిగా మాత్రం చరిత్రలో నిలవలేడు. ఎందుకంటే ఈ అరుదైన రికార్డు ఒక భారతీయ క్రికెట్ దిగ్గజం పేరిట చెక్కుచెదరకుండా పదిలంగా ఉంది.
ఇది కూడా చదవండి: ఐపీఎల్ ఆడకముందే టీమిండియాలోకి పిలుపు.. కట్ చేస్తే.. బెంచ్కే పరిమితమైన ఐదుగురు అన్ లక్కీ ప్లేయర్లు..!
దశాబ్దాలుగా చెక్కుచెదరని రుస్తుంజీ రికార్డు..
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పెద్ద వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రుస్తుంజీ జంషెడ్జీ రికార్డు సృష్టించాడు. టీమిండియా తరఫున ఏకంగా 41 ఏళ్ల 27 రోజుల వయసులో రుస్తుంజీ అంతర్జాతీయ క్రికెట్లోకి సగర్వంగా అడుగుపెట్టాడు. 1933 డిసెంబర్ 15వ తేదీన ముంబై మైదానం వేదికగా పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టుపై అతడు తన తొలి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమిండియా తరఫున అంత పెద్ద వయసులో అరంగేట్రం చేసిన మరో ఆటగాడు లేకపోవడం గమనార్హం. అద్భుతమైన ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన రుస్తుంజీ, తాను ఆడిన తొలి మ్యాచ్లో ప్రత్యర్థి జట్టుకు చెందిన 3 కీలక వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాట్ తో 5 పరుగులు కూడా సాధించాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతడికి దక్కిన ఈ తొలి అంతర్జాతీయ మ్యాచ్, అతడి కెరీర్లో ఏకైక మ్యాచ్గా మిగిలిపోవడం విశేషం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..