భారతదేశంలో ప్రవహించే నదులన్నింటిలో గంగా నది అత్యంత పవిత్రమైనది. అతి పొడవైనది. గంగోత్రి హిమానీనదం వద్ద జన్మించి, సుమారు 2,525 కిలోమీటర్ల దూరం ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే, గంగా నది ప్రయాణం కేవలం భారతదేశానికే పరిమితం కాదు. ఇది తన మార్గంలో అంతర్జాతీయ సరిహద్దులను దాటి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. భౌగోళికంగా ఈ ప్రవాహ మార్గంలో నది పేరు మారడం ఒక ఆసక్తికరమైన అంశం.
గంగా నది నుంచి పద్మా నదిగా…
గంగా నది పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా గుండా ప్రవహించి, బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. బంగ్లాదేశ్ సరిహద్దు దాటిన వెంటనే గంగా నదిని పద్మా నదిగా పిలుస్తారు. స్థానిక భాషలో బంగ్లాదేశ్ భౌగోళిక మ్యాపులలో దీనిని పద్మా నదిగానే పేర్కొంటారు. బంగ్లాదేశ్ ప్రజల జీవనాధారంగా, వ్యవసాయానికి ప్రధాన నీటి వనరుగా ఈ నది కీలక పాత్ర పోషిస్తుంది.
మేఘనా గా రూపాంతరం:
పద్మా గా పిలువబడే గంగా నది ప్రయాణం అక్కడితో ముగియదు. బంగ్లాదేశ్లో ప్రవహిస్తున్న మరో ప్రధాన నది అయిన బ్రహ్మపుత్ర, ఆ దేశంలో జమున నదిగా పిలవబడుతుంది. గోలుందో ఘాట్ వద్ద పద్మా నది, జమున నదితో కలుస్తుంది. ఇలా రెండు పెద్ద నదులు కలిసిన తర్వాత ఏర్పడిన ఉమ్మడి ప్రవాహాన్ని మేఘనా నది అని పిలుస్తారు. ఈ మేఘనా నది చివరికి సుందర్బన్ డెల్టా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఇవి కూడా చదవండి
అయితే, చాలా వరకు పోటీ పరీక్షలలో గంగా నదిపై పలు రకాల ప్రశ్నలు వస్తుంటాయి. అభ్యర్థులు కోసం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య అంశాలు అనేకం ఉన్నాయి.
పోటీ పరీక్షలలో (UPSC, SSC, State PSC) భౌగోళిక అంశాల విభాగంలో తరచుగా అడిగే కొన్ని కీలక ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి:
భారతదేశ జాతీయ నది: గంగ.
బంగ్లాదేశ్లో గంగా నది పేరు: పద్మా.
బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నది పేరు: జమున.
పద్మా, జమున కలిసిన తర్వాత ఏర్పడే పేరు: మేఘనా.
ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా: గంగా-బ్రహ్మపుత్ర డెల్టా (సుందర్బన్ డెల్టా).
ఒకే నది వివిధ ప్రాంతాల గుండా ప్రవహిస్తున్నప్పుడు ఆయా సంస్కృతులు, భాషల ప్రభావంతో వేర్వేరు పేర్లతో పిలవబడటం భౌగోళిక శాస్త్రంలో ఒక ప్రత్యేకత. గంగా నది కేవలం భారతదేశానికే కాదు, పొరుగు దేశమైన బంగ్లాదేశ్కు కూడా జీవనదిగా నిలుస్తూ రెండు దేశాల మధ్య అనుబంధాన్ని చాటిచెబుతోంది.