
కేంద్ర ప్రభుత్వం కొత్తగా నాలుగు కార్మిక చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది వీటిని తీసుకురాగా.. దేశంలోని ఉద్యోగులందరికీ సామాజిక, ఆర్ధిక భద్రత కల్పించడంలో ఇది ఉపయోగపడుతున్నాయి. వేతనాల చెల్లింపు, పని వేళలు, గ్రాట్యూటి, పీఎఫ్ సౌకర్యం వంటి నిబంధనల్లో కేంద్రం మార్పులకు శ్రీకారం చుట్టింది. వేతనాల నియమావళి, యజమానులు జీతాలు, వేతనాలను ఎప్పుడు చెల్లించాలనే విషయాలపై డేట్ ఫిక్స్ చేసింది. ఈ రూల్స్ ప్రకారం నెలవారీ జీతాలు పొందేవారికి తర్వాతి నెల ఏడో తేదీలోపు వేతనం చెల్లించాలి. ఇక ఉద్యోగం మానేసినా లేదా తొలగించినా రెండు రోజుల్లోగా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది.
జీతాలు చెల్లించకపోతే ఫిర్యాదు చేయొచ్చు..
సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా వేతనాల చెల్లింపులో జాప్యం లేదా అనధికారిక కోతల సందర్భాలలో ఉద్యోగులు పరిహారం అందించాల్సి ఉంటుంది. వారానికి జీతం పొందే ఉద్యోగులు వారంలోని చివరి పనిదినానికి ముందే తమ వేతనాలను అందుకోవాలి. 15 రోజులకు ఒకసారి జీతం తీసుకునే వారికి.. 15 రోజులు ముగిసిన రెండు రోజుల్లోగా చెల్లించాలి. రోజువారీ వేతనం పొందే ఉద్యోగులు పనిదినం ముగిసే సమయానికి తమ వేతనాలను అందుకోవాలి. వేతనాలు ఆలస్యమైనా లేదా అనధికారిక కోతలు విధించినా ఉద్యోగులు ఫిర్యాదు చేయవచ్చు. అటువంటి ఫిర్యాదులను దాఖలు చేయడానికి చట్టం మూడు సంవత్సరాల కాలపరిమితి ఇచ్చింది. ఒకవేళ అధికార సంస్థ యజమానిని వేతనాలు లేదా నష్టపరిహారం చెల్లించమని ఆదేశిస్తే.. యజమాని ఆ ఆదేశాన్ని పాటించడంలో విఫలమైతే ఆ మొత్తాన్ని కోడ్ నిబంధనల ప్రకారం భూమి శిస్తు బకాయిలుగా వసూలు చేయవచ్చు.
ఇక ఇప్పటివరకు గ్రాట్యూటీ మినిమం ఐదేళ్లు ఒక కంపెనీలో పనిచేస్తే అందించేవారు. కానీ ఇప్పుడు ఆ నిబంధనలను మార్చారు. ఒక ఏడాది పనిచేసినా గ్రాట్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో చాలామంది పదే పదే ఉద్యోగాలు మారుతున్నారు. లేఆఫ్లు, ఇతర కారణాలతో తరచుగా ఉద్యోగులు మారుతున్నారు. దీంతో కేంద్రం గ్రాట్యూటీ రూల్స్లో మార్పులు చేసింది. అలాగే ఇతర రంగాల్లో పనిచేస్తే ఉద్యోగులకు కూడా పెన్షన్, హెల్త్ ఇన్యూరెన్స్ వంటివి అందించాలని ఆదేశించింది.