PBKS vs RR : ఐపీఎల్ 2026లో భాగంగా నేడు న్యూ చండీగఢ్లో పంజాబ్ కింగ్స్ (PBKS), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ముల్లాంపూర్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కీలక మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారుతుందా? అనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో న్యూ చండీగఢ్ తాజా వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం.
ముల్లాంపూర్లో వాతావరణం ఎలా ఉందంటే?
భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. నేడు చండీగఢ్లో వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే, వర్షం పడే సూచనలు 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అంటే మ్యాచ్కు చిన్నపాటి అంతరాయం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, పూర్తి మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంగళవారం చండీగఢ్లో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదు కావచ్చు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మ్యాచ్ సమయంలో వర్షం పడుతుందా?
బీబీసీ వెదర్ నివేదిక ప్రకారం.. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం పడే అవకాశం 40 శాతం వరకు ఉంది. అయితే, రాత్రి గడిచే కొద్దీ వర్ష సూచన తగ్గుతూ వస్తుందని సమాచారం. రాత్రి 9:30 గంటల సమయానికి వర్షం పడే అవకాశం కేవలం 20 శాతానికి పడిపోతుంది. కాబట్టి అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు, ఆట సజావుగానే సాగే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన 39 మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే వర్షం కారణంగా రద్దయ్యింది. ఆశ్చర్యకరంగా ఆ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఒక జట్టుగా ఉంది, అందుకే అభిమానులకు ఈసారి కూడా అలాంటి భయం పట్టుకుంది.
ముల్లాంపూర్లో ఇదే చివరి మ్యాచ్
ఈ సీజన్లో ముల్లాంపూర్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో మ్యాచ్ ఇది. పంజాబ్ కింగ్స్ తన తదుపరి హోమ్ మ్యాచులను ధర్మశాలలో ఆడనుంది. ఒకవేళ ముల్లాంపూర్కు ప్లేఆఫ్స్ మ్యాచ్ల ఆతిథ్యం దక్కకపోతే, ఈ స్టేడియంలో ఈ సీజన్కు ఇదే ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది. అందుకే ఈ మ్యాచ్ను స్టేడియంలో చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్నారు. మరి ఈ వీడ్కోలు మ్యాచ్కు వరుణుడు ఏ మేరకు సహకరిస్తాడో వేచి చూడాలి.
పాయింట్ల పట్టికలో పంజాబ్ హవా
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో 6 గెలిచి, ఒకటి వర్షం వల్ల ముగిసింది. ఈ మ్యాచ్లో ఓడినా, గెలిచినా పంజాబ్ అగ్రస్థానంలోనే ఉంటుంది. ఎందుకంటే రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖాతాలో 12 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ రేసులో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. వైభవ్ సూర్యవంశీ వంటి యువ హిట్టర్లు రంగంలో ఉండటంతో పరుగుల వర్షం కురుస్తుందో లేక నిజమైన వర్షం పడుతుందో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..