ఐపీఎల్ అంటేనే ఉత్కంఠకు మారుపేరు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండుగే. అయితే ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా జరిగిన తాజా పోరులో చెన్నై జట్టు ముంబైని చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెన్నైకి భారీ స్కోరు అందించాడు. కానీ చర్చంతా ముంబై జట్టు ప్రదర్శన, ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాల చుట్టూనే తిరుగుతోంది. ముంబై బౌలర్లు ఈ మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. స్వయంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లలోనే 38 పరుగులు ఇచ్చి బ్యాటర్లకు లైఫ్ ఇచ్చాడు.
అనంతరం బ్యాటింగ్లో కూడా ముంబై బ్యాటర్లు ఎవరూ కనీస పోటీ ఇవ్వలేకపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. టాప్ ఆర్డర్ వైఫల్యమే ఓటమికి కారణమని చెప్పడం విశేషం. అంటే తన తప్పు ఏమీ లేదన్నట్లుగా మాట్లాడటం ఇప్పుడు వివాదాస్పదమైంది. దీనిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. “ముంబై ఓటమికి ప్రధాన కారణం నీ ఆలోచన లేని నిర్ణయాలే” అంటూ హార్దిక్పై మండిపడ్డారు. ఒక కెప్టెన్ తన వైఫల్యాన్ని ఒప్పుకోకుండా ఇతరులపై నెట్టేయడం సరికాదని హితవు పలికారు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో కేవలం రెండింట్లో మాత్రమే గెలిచిన ముంబై, ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ల్లో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెప్టెన్సీ మార్పు నుంచి ముంబైని వెంటాడుతున్న కష్టాలు ఎప్పుడు తీరుతాయో వేచి చూడాలి.
ఇది చదవండి: మీ భూమి కబ్జాకు గురైందా? ఆస్తిని తిరిగి దక్కించుకోవడం ఈజీ.. ఈ ఒక్క పని చేస్తే చాలు..