IPL 2026 : నిజమే.. నాకు ఒళ్లంతా ఈగో ఉంది.. గ్రౌండ్లోకి దిగే ముందే దాన్నీ హోటల్లో వదిలేస్తా.. స్టార్ బౌలర్ కామెంట్స్

IPL 2026 : నిజమే.. నాకు ఒళ్లంతా ఈగో ఉంది.. గ్రౌండ్లోకి దిగే ముందే దాన్నీ హోటల్లో వదిలేస్తా.. స్టార్ బౌలర్ కామెంట్స్


IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై రాజస్థాన్ విజయం సాధించిన తర్వాత జడేజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. తన వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని చాటిచెప్పిన జడేజా, ఆట పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు.

ఐపీఎల్ 2026లో చెన్నైని వీడి రాజస్థాన్ రాయల్స్ లో చేరిన జడేజాకు కొన్ని మ్యాచ్‌ల్లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. తన కోటాలో ఉన్న 4 ఓవర్లను పూర్తి చేయకముందే కెప్టెన్ బౌలింగ్ ఆపేస్తున్నా, జడేజా ఏమాత్రం అసహనానికి గురికావడం లేదు. దీనిపై స్పందిస్తూ.. “నేను మైదానంలోకి అడుగుపెట్టే ముందే నాకు ఉన్న ఈగోను హోటల్ గదిలోనే వదిలేసి వస్తాను. జట్టు నన్ను ఏ బాధ్యత కోరినా అది నెరవేర్చడమే నా లక్ష్యం. వ్యక్తిగత ప్రదర్శన కంటే టీమ్ గెలుపే ముఖ్యం” అని జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో జడేజా 29 బంతుల్లో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. చివరి వరకు క్రీజులో ఉండటం వల్లే రాజస్థాన్ 159 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. “నేను గనుక 17 లేదా 18వ ఓవర్లో అవుట్ అయి ఉంటే, మేము మరో 20-25 పరుగులు తక్కువ చేసేవాళ్లం. అప్పుడు లక్నోకు లక్ష్యం సులువయ్యేది. కానీ వికెట్ కండిషన్స్ అర్థం చేసుకుని నెమ్మదిగా బౌలింగ్ చేయడం మాకు కలిసొచ్చింది” అని జడేజా వివరించారు. ఈ మ్యాచ్‌లో ఆయన బ్యాటింగ్‌తో పాటు 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి ఒక కీలక వికెట్ కూడా తీశారు.

మరోవైపు లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ తీరుపై మాజీ కోచ్ సంజయ్ బంగర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం మూడు బంతులు ఆడి, అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి డకౌట్ అవ్వడం బాధ్యతారాహిత్యమని బంగర్ అన్నారు. పంత్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం ఉన్నప్పటికీ, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడకుండా వికెట్ పారేసుకోవడం జట్టు ఓటమికి కారణమైందని ఆయన విశ్లేషించారు.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 40 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో చెలరేగగా, బ్రిజేష్ శర్మ, నండ్రే బర్గర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పిచ్ మందకొడిగా ఉండటాన్ని గమనించిన రాజస్థాన్ బౌలర్లు లక్నోను 119 పరుగులకే కట్టడి చేశారు. అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *