VVS Laxman vs Gautam Gambhir: శ్రీలంకతో జరగనున్న ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్కు టీమిండియా హెడ్ కోచ్ ఎవరన్న సస్పెన్స్కు ఎట్టకేలకు తెరపడింది. జింబాబ్వే టూర్లో వీవీఎస్ లక్ష్మణ్ అద్భుత విజయాలు సాధించడంతో గౌతమ్ గంభీర్ స్థానం గల్లంతైందన్న పుకార్లకు బీసీసీఐ పూర్తిగా చెక్ పెట్టింది. కీలకమైన లంక పర్యటనకు పగ్గాలు చేపట్టేది గంభీరేనని, కోచ్ మార్పు వార్తల్లో ఎలాంటి నిజం లేదని కుండబద్దలు కొట్టింది.
శ్రీలంక పర్యటన కోసం పదిహేను మంది ఆటగాళ్లతో కూడిన పటిష్టమైన జట్టును క్రికెట్ బోర్డు ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇటీవల ఆఫ్రికా ఖండంలో ముగిసిన జింబాబ్వే టీ20 సిరీస్. యువ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత యువ జట్టు అద్భుతంగా ఆడి ఆ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఆ పర్యటనకు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోగా, నేషనల్ క్రికెట్ అకాడమీ బాధ్యతలు చూసుకునే వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా పగ్గాలు చేపట్టాడు. తనదైన ప్రశాంత శైలిలో కుర్రాళ్లను ముందుండి నడిపించి అద్భుతమైన రిజల్ట్ రాబట్టాడు. ఎలాంటి అనుభవం లేని కుర్రాళ్లతో కూడిన జట్టును తీసుకువెళ్లి, విదేశీ గడ్డపై ఆతిథ్య జట్టును వణికించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న గంభీర్ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించి, పూర్తిగా లక్ష్మణ్కే టెస్ట్ జట్టు బాధ్యతలు అప్పగించాలని నెటిజన్లు పెద్ద ఎత్తున బీసీసీఐకి విజ్ఞప్తులు చేయడం మొదలుపెట్టారు.
ఇది కూడా చదవండి: ముగిసిన జింబాబ్వే సిరీస్.. వైభవ్ సూర్యవంశీ మళ్లీ మైదానంలోకి దిగేది ఎప్పుడో తెలుసా?
ఇవి కూడా చదవండి
వదంతులకు చెక్.. లంక గడ్డపై వ్యూహకర్త అతడే..
నెట్టింట జరుగుతున్న ఈ రచ్చకు తెరదించుతూ రాబోయే కఠినమైన శ్రీలంక టెస్ట్ సిరీస్కు గౌతమ్ గంభీరే హెడ్ కోచ్గా వ్యవహరిస్తాడని స్పష్టత వచ్చేసింది. అసలు కుర్రాళ్లతో కూడిన జింబాబ్వే పర్యటనకు గంభీర్ దూరమవ్వడం వెనుక వేరే బలమైన కారణం ఉందన్న విషయాన్ని సీనియర్ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. రాబోయే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాలంటే శ్రీలంకపై టెస్ట్ సిరీస్ గెలవడం టీమిండియాకు చాలా కీలకం. అందుకే ఆ సిరీస్ కోసం పక్కాగా వ్యూహాలు రచించుకోవడానికే గంభీర్ ఈ చిన్నపాటి విరామం తీసుకున్నాడు. అంతేకానీ లక్ష్మణ్ను కోచ్గా శ్రీలంక విమానం ఎక్కించే ఉద్దేశం బీసీసీఐ పెద్దలకు ఏమాత్రం లేదు. రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు భారత జట్టును నడిపించేందుకు గంభీర్తో బోర్డు పక్కా ఒప్పందం చేసుకుంది. ఆలోపు అతడిని పదవి నుంచి తప్పించే సాహసం ఎవరూ చేయరని స్పష్టమైంది.
గంభీర్పై డబ్ల్యూటీసీ ఒత్తిడి.. అసలు పరీక్ష ఇక్కడే..!
నిజానికి రవిశాస్త్రి, ద్రావిడ్ తర్వాత హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్కు పరిస్థితులు అస్సలు కలిసిరావడం లేదు. సొంతగడ్డపై టెస్ట్ ఫార్మాట్లో ఎవరికీ తలవంచని టీమిండియా ప్రదర్శన ఈ మధ్యకాలంలో దారుణంగా పడిపోయింది. బలహీనంగా కనిపించిన న్యూజిలాండ్ చేతిలో అవమానకర రీతిలో వైట్వాష్కు గురై తీవ్ర విమర్శల పాలైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా చేతిలోనూ మనకు భంగపాటు తప్పలేదు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేసర్ల ధాటికి తట్టుకోలేక మూడు ఒకటి తేడాతో సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. బలమైన ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల సుదీర్ఘ సిరీస్ను మాత్రమే అతికష్టం మీద సమం చేసుకోగలిగింది. ఇలాంటి పరాజయాలతో ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు ఏకంగా ఐదో స్థానానికి దిగజారిపోయింది. ఒకప్పుడు టాప్ స్థానంలో రారాజులా వెలిగిన భారత జట్టు, ఇప్పుడు ఏకంగా ఐదో స్థానానికి పడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
ఇది కూడా చదవండి: టీమిండియా ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. స్టార్ ఆల్రౌండర్ రెడీ.. వేటకు సిద్ధమంటూ సిగ్నల్..!
ఫైనల్ చేరాలంటే సిరీస్ స్వీప్ చేయాల్సిందే..
ఫైనల్ చేరాలంటే అద్భుతాలు జరగాలి. 2027 ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలంటే ఇటు భారత్కు, అటు శ్రీలంకకు రాబోయే ఈ రెండు మ్యాచ్ల సిరీస్ ప్రాణసంకటంగా మారింది. శ్రీలంక పట్టికలో ఆరో స్థానంలో ఉండి మనకు గట్టి పోటీ ఇస్తోంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఫైనల్ దారులు దాదాపు మూసుకుపోతాయి. అందుకే శ్రీలంకను వారి సొంతగడ్డపైనే 2 – 0 తేడాతో చిత్తు చేయాలన్న కసితో గంభీర్ తనదైన మాస్టర్ ప్లాన్ రచిస్తున్నాడు. లంకతో పోరు కోసమే విశ్రాంతి సమయంలో కుదురుగా కూర్చుని పాత మ్యాచ్ల తాలూకు లోపాలను తీవ్రంగా విశ్లేషించాడు. సిరీస్ ఆరంభానికి ముందే ఆటగాళ్లకు స్పష్టమైన పాత్రలు అప్పగించి, మైదానంలో ఆధిపత్యం చెలాయించేలా పక్కా బ్లూప్రింట్ సిద్ధం చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..