గుంటూరు రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి హాట్ టాపిక్గా మారారు. తనను ఇబ్బంది పెట్టిన పోలీసులను, తన ఇల్లు ఆఫీస్పై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షను ఆయన విరమించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో తనతో పాటు దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబును దూషించాననే సాకుతో తనను అరెస్ట్ చేసి 18 రోజులు జైల్లో పెట్టారన్నాని.. కానీ తన ఇంటిపై దాడి చేసి కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన వారిని కనీసం 18 నిమిషాలు కూడా లాకప్లో వేయలేకపోయారన్నారు. ఆ దాడి వెనుక ఉన్న చంద్రబాబు, నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్లు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తన ఇంటిపై దాడికి తెగబడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకూ తన పోరాటం ఆగదన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.