Headlines

GDP లెక్కలపై కేంద్రం క్లారిటీ.. కొత్త సిరీస్‌లో మార్పులకు కారణాలివే


భారత జీడీపీ అంచనాలపై వస్తున్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. 2022-23 బేస్‌ ఇయర్‌తో కొత్త జీడీపీ సిరీస్‌ను ఆగస్టు 31న విడుదల చేసిన ప్రభుత్వం.. క్యూఐ 2026-27 అంచనాలకు సంబంధించి అదనపు వివరాలను సెప్టెంబర్‌ 2న వెల్లడించింది. ముఖ్యంగా డబుల్‌ డిఫ్లేషన్‌, నెగెటివ్‌ ఇంప్లిసిట్‌ డిఫ్లేటర్‌, నామినల్‌-రియల్‌ జీడీపీ మధ్య తేడాలు, పాత-కొత్త సిరీస్‌ వృద్ధి రేట్లపై స్పష్టత ఇచ్చింది.

తయారీ రంగంలో నెగెటివ్‌ డిఫ్లేటర్‌ ఎందుకు?

తయారీ రంగంలో క్యూ1 2026-27లో ఇంప్లిసిట్‌ జీవీఏ డిఫ్లేటర్‌ -1.5 శాతంగా నమోదవడంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. డబుల్‌ డిఫ్లేషన్‌ విధానంలో ఉత్పత్తి, మధ్యంతర వినియోగాన్ని విడివిడిగా ధరల ఆధారంగా సర్దుబాటు చేస్తారు. ఇన్‌పుట్‌ ధరలు అవుట్‌పుట్‌ ధరల కంటే వేగంగా పెరిగితే నామినల్‌ జీవీఏ వృద్ధి రియల్‌ జీవీఏ కంటే తక్కువగా ఉండొచ్చు. అందువల్ల నెగెటివ్‌ డిఫ్లేటర్‌ కనిపించినంత మాత్రాన తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గాయని అర్థం కాదని కేంద్రం తెలిపింది. క్యూ1లో తయారీ రంగం నామినల్‌ జీవీఏ 7.7 శాతం, రియల్‌ జీవీఏ 9.2 శాతం పెరిగినట్లు పేర్కొంది.

గతేడాది జీడీపీ ఎందుకు తగ్గింది?

2025-26 క్యూ1 జీడీపీని పాత సిరీస్‌లో రూ.86.05 లక్షల కోట్లుగా అంచనా వేయగా, కొత్త 2022-23 బేస్‌ ఇయర్‌ సిరీస్‌లో అది రూ.80.32 లక్షల కోట్లకు మారింది. ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన కొత్త డేటా, ఐఐపీ, పీపీఐలను చేర్చడంతో అంచనా రూ.80 లక్షల కోట్లకు సవరించబడింది. ఇది ప్రస్తుత ఏడాది వృద్ధిని పెంచేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన తగ్గింపు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సీపీఐ, డబ్ల్యూపీఐతో జీడీపీ డిఫ్లేటర్‌ ఎందుకు భిన్నం?

సీపీఐ వినియోగదారుల ధరలను, డబ్ల్యూపీఐ హోల్‌సేల్‌ వస్తువుల ధరలను ప్రతిబింబిస్తాయి. కానీ జీడీపీ డిఫ్లేటర్‌ మొత్తం ఆర్థిక వ్యవస్థలోని వస్తువులు, సేవలు, ప్రభుత్వ వ్యయం, పెట్టుబడులు, ఎగుమతులు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అందువల్ల సీపీఐ, డబ్ల్యూపీఐతో జీడీపీ డిఫ్లేటర్‌ ఒకే రీతిలో కదలాల్సిన అవసరం లేదని కేంద్రం వివరించింది.

మైనింగ్‌లో నామినల్‌-రియల్‌ జీడీపీకి భారీ తేడా

మైనింగ్‌ రంగంలో క్యూ1లో రియల్‌ జీవీఏ 2.4 శాతం తగ్గినా, నామినల్‌ జీవీఏ 22.3 శాతం పెరిగింది. ముఖ్యంగా క్రూడ్‌ పెట్రోలియం, సహజ వాయువు ధరలు భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణమని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న గణాంకాలు మరింత డేటా అందుబాటులోకి వచ్చినకొద్దీ సవరించబడే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. గణాంక అసమానతలు తదుపరి దశల్లో మారవచ్చని, అయితే జీడీపీ తప్పనిసరిగా పెరుగుతుందని లేదా తగ్గుతుందని ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *