Headlines

ఘోర విషాదం.. అర్థరాత్రి పేకమేడలా కూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు..!

ఘోర విషాదం.. అర్థరాత్రి పేకమేడలా కూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు..!


మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో శుక్రవారం (జూలై 31) అర్థరాత్రి భారీ విషాదం చోటుచేసుకుంది. భండారీ కంపౌండ్‌లోని గంగారామ్‌వాడి ప్రాంతంలో ఉన్న ‘కోహినూర్’ అపార్ట్‌మెంట్ బి-వింగ్‌కు చెందిన నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనతో భవనంలో మరమ్మతు పనులు చేస్తున్న కార్మికులతో పాటు అక్కడ నివసిస్తున్న పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 10 నుంచి 12 మంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా 5 నుంచి 6 మంది శిథిలాల కింద ఉండే అవకాశం ఉందని తెలిపారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), టీడీఆర్‌ఎఫ్ (TDRF), అగ్నిమాపక శాఖ, పోలీసులు, భివండి-నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకురాగా, వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. అయితే శిథిలాల నుంచి మూడు మృతదేహాలను కూడా వెలికితీశారు. మృతుల్లో 32 ఏళ్ల షమీమ్ షేక్‌గా ఒకరి గుర్తింపు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

సుమారు 14 నుంచి 15 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని మున్సిపల్ అధికారులు ఇప్పటికే ప్రమాదకర భవనంగా గుర్తించి నాలుగు సార్లు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఎక్కువ మంది నివాసితులను ముందుగానే ఖాళీ చేయించినప్పటికీ, భవనంలో మరమ్మతు పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒకేసారి మూడు స్తంభాలను తొలగించడం వల్ల భవనం సమతుల్యత కోల్పోయి కూలిపోయి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

సహాయక చర్యల సందర్భంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన ఒక జవాన్ గాయపడగా, అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే మహేష్ చౌఘ్లే మాట్లాడుతూ, ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే అధికార యంత్రాంగం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *