ప్రయాణికులకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. ఫ్రీ లగేజీ రూల్స్లో కొత్త మార్పులు చేసింది. ట్రైన్లలో ఉచిత లగేజీ పరిమితికి మించి మీరు తీసుకెళ్లాలంటే ముందుగానే పార్సిల్ ఆఫీస్ దగ్గర బుకింగ్ చేసుకుని పేమెంట్ చెల్లించాలి. అయితే ఇక నుంచి మీరు పార్సిల్ ఆఫీస్ దగ్గరకు వెళ్లాల్సిన పని లేదు. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలోనే అదనపు లగేజీకి సంబంధించిన వివరాలను సమర్పించి బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ కొత్త సదుపాయం వల్ల ప్రయాణికులు రైల్వే పార్సిల్ సెంటర్ల వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు. దీని వల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. జులై 31వ తేదీ నుంచి ఆన్లైన్లోనే అదనపు లగేజీ కోసం బుకింగ్ ఆప్షన్ రైల్వేశాఖ తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ రిజర్వేషన్ సిస్టమ్లోనే కొత్త ఆప్షన్ జోడించనుంది. కోచుల్లోకి తీసుకెళ్లగలిగే గరిష్ట పరిమితి వరకు ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకోవచ్చు
ట్రైన్లలో ప్రయాణించేటప్పుడు మీ వెంట ఎంత లగేజీ వెంట తీసుకెళ్లవచ్చనే దానిపై కొన్ని పరిమితులు ఉన్నాయి. అలాగే పరిమితి దాటాక గరిష్టంగా ఎంతవరకు లగేజీ తీసుకెళ్లవచ్చనే దానిపై కొన్ని పరిమితులు ఉన్నాయి. మీరు ఒకవేళ ఏసీ ఫస్ట్ క్లాసులో ప్రయాణిస్తుంటే 70 కిలోల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఇక అదనంగా ఫీజు చెల్లించి గరిష్టంగా 150 కిలోల వరకు మీ వెంట తీసుకెళ్లవచ్చు. ఇక ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్లో ఫ్రీగా 50 కిలోలు, 100 కిలోలు గరిష్టంగా తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది.
ఇక స్లీపర్ క్లాసులో 40 కిలోల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఆ తర్వాత 80 కేజీల వరకు అదనపు ఫీజు చెల్లించాలి. ఇక సెకండ్ క్లాస్, జనరల్ కోచుల్లో 35 కిలోలు ఉచితంగా మీ వెంట తీసుకెళ్లవచ్చు. ఇక గరిష్ట పరిమితి 70 కిలోలుగా ఉంది. ఏసీ 3 టైర్ అండ్ ఏసీ చైర్ కార్లో ఉచితంగా 40 కేజీలు తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు రైల్వేశాఖ తన నిబంధనల్లో పొందుపర్చింది.
ఉచిత పరిమితి ముగిసిన తర్వాత అదనంగా తీసుకెళ్లే లగేజీకి సాధారణ లగేజ్ రేటు కంటే 1.5 రేట్లు అదనంగా చెల్లించాలి. ఒకవేళ మీరు చెల్లించకుండా తీసుకెళ్లితే అధికారులు గుర్తించినప్పుడు భారీగా జరిమానా విధిస్తారు. నిర్ణీత సైజు కంటే పెద్దవిగా ఉన్న లగేజ్ను ప్రయాణికుల కంపార్ట్మెంట్లోకి అనుమతించరు. వీటిని తప్పనిసరిగా రైలులోని లగేజ్ వ్యాన్/పార్సిల్ వ్యాన్లో బుక్ చేయాల్సి ఉంటుంది.




