Headlines

EPFO: కంపెనీ మారిన ఉద్యోగి.. PF నిధుల బదిలీలో జాప్యం! షాకింగ్‌ తీర్పు

EPFO: కంపెనీ మారిన ఉద్యోగి.. PF నిధుల బదిలీలో జాప్యం! షాకింగ్‌ తీర్పు


చందాదారుడి ఈపీఎఫ్‌ నిధుల బదిలీలో పదేళ్ల జాప్యం చేసినందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌పై (EPFO) చండీగఢ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-II తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సేవలలో నిర్లక్ష్యం, అనవసర ఆలస్యం కారణంగా బాధితుడికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. ఈ కేసు, ప్రభుత్వ సేవల్లో సాంకేతిక లోపాలు సాధారణ ఉద్యోగులపై ఎంతటి ప్రభావం చూపుతాయో మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. ఫిర్యాదుదారు ఒమేష్ గార్గ్ 2009లో పూణేలోని టెక్ మహీంద్రా ఉద్యోగాన్ని వదిలి, 2010లో ఇన్ఫోసిస్‌లో చేరారు. ఆ సమయంలో తన పాత ఈపీఎఫ్ ఖాతాలోని నిధులను కొత్త ఖాతాకు బదిలీ చేయాలని అధికారికంగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ బదిలీ ప్రక్రియ వెంటనే జరగాల్సి ఉండగా, దాదాపు పదేళ్లు పెండింగ్‌లో పడిపోయింది.

నిధుల బదిలీ కోసం గార్గ్ 2011 నుంచి పలు ఆర్టీఐ దరఖాస్తులు, లేఖలు పంపినా ఫలితం లేకపోయిందని ఆయన ఆరోపించారు. చివరకు 2020లో ఈపీఎఫ్ఓ రూ.6.21 లక్షలు మాత్రమే బదిలీ చేసింది. అయితే తనకు రావాల్సిన మొత్తం రూ.11.07 లక్షలు అని గార్గ్ వాదించారు. ముఖ్యంగా 2011 తర్వాత తన ఖాతాలో వడ్డీ జమ చేయకపోవడం వల్ల భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. విచారణ సందర్భంగా ఈపీఎఫ్ఓ ఆలస్యాన్ని అంగీకరించింది.

అయితే సాఫ్ట్‌వేర్ లోపాలు, సాంకేతిక సమస్యల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వివరణ ఇచ్చింది. కేసు తిరిగి పరిశీలించిన తర్వాత పెండింగ్ వడ్డీగా రూ.64,841తో పాటు మరో రూ.3.67 లక్షలు జమ చేసినట్లు తెలిపింది. అయినప్పటికీ ఇంకా రూ.1.62 లక్షలు బకాయిగా ఉన్నాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ కేసులో కమిషన్ స్పష్టం చేసిన విషయం ఏమిటంటే ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం ఉన్న ఈపీఎఫ్ వ్యవస్థలో ఇలాంటి ఆలస్యాలు సరికాదని పేర్కొంది. డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వ సంస్థలు తమ సేవలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని కమిషన్ సూచించింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *