Headlines

అమెరికా స్టూడెంట్‌ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. సెప్టెంబర్‌ 15 వరకే డెడ్‌లైన్‌

అమెరికా స్టూడెంట్‌ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. సెప్టెంబర్‌ 15 వరకే డెడ్‌లైన్‌


అమెరికా కొత్త ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేస్తున్నాయి. ఇప్పటి వరకు అమెరికాలో ఎఫ్-1 (F-1) స్టూడెంట్‌ వీసా, జే-1 (J-1) ఎక్స్చేంజ్‌ వీసాలపై ఉన్న విద్యార్థులు ‘డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌ (D/S)’ విధానం కింద తమ విద్యా కార్యక్రమం పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. అయితే అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (DHS) తీసుకొచ్చిన కొత్త ఫైనల్‌ రూల్‌ ప్రకారం ఈ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

కొత్త నిబంధనలేమిటి?

సెప్టెంబర్‌ 15 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో గరిష్ఠంగా నాలుగు సంవత్సరాల పాటు మాత్రమే ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత చదువులు కొనసాగించాలంటే లేదా వీసా గడువు పొడిగించుకోవాలంటే యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS) అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందుకోసం Form I-539 ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కోర్సు పూర్తైన తర్వాత విద్యార్థులకు ప్రస్తుతం లభిస్తున్న 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ను 30 రోజులకు తగ్గించారు. దీంతో చదువులు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు లేదా తదుపరి ప్రణాళికల కోసం విద్యార్థులకు లభించే సమయం కూడా తగ్గనుంది.

సెప్టెంబర్‌ 15కు ముందు తిరిగి వస్తే?

అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం సహా పలు విద్యాసంస్థలు విద్యార్థులకు ప్రత్యేక సూచనలు జారీ చేశాయి. సెప్టెంబర్‌ 15కు ముందు అమెరికాలోకి తిరిగి ప్రవేశిస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న D/S విధానం కింద ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. కొలంబియా యూనివర్సిటీ తన నోటీసులో సెప్టెంబర్‌ 8న తరగతులు ప్రారంభమవుతున్నందున విద్యార్థులు ఆ తేదీకి ముందే న్యూయార్క్‌కు చేరుకోవాలని సూచించింది.

వారికి ఉపశమనం

DHS ప్రకారం సెప్టెంబర్‌ 15 నాటికి ఇప్పటికే అమెరికాలో D/S హోదాతో ఉన్న విద్యార్థులు తమ Form I-20లో పేర్కొన్న కోర్సు పూర్తి తేదీ వరకు లేదా అనుమతించబడిన OPT/STEM OPT గడువు ముగిసే వరకు అమెరికాలో ఉండవచ్చు. అయితే ఈ సడలింపు కూడా నాలుగు సంవత్సరాల గరిష్ఠ పరిమితికి లోబడి ఉంటుంది. అలాగే నవంబర్‌ 14, 2030 తర్వాత ఈ సౌకర్యం వర్తించదు.

భారతీయ విద్యార్థుల్లో ఆందోళన

కొత్త నిబంధనలతో అమెరికాలో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పీహెచ్‌డీ, వైద్య విద్య, పరిశోధన ఆధారిత కోర్సులు సాధారణంగా నాలుగేళ్లకు మించి కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పోరా స్టడీస్‌ (FIIDS) పాలసీ అండ్‌ స్ట్రాటజీ చీఫ్‌ ఖండేరావ్‌ కంద్‌ మాట్లాడుతూ ‘నాలుగేళ్ల పరిమితి ఆధునిక ఉన్నత విద్యా వ్యవస్థకు అనుకూలంగా లేదు. చాలా బ్యాచిలర్‌ డిగ్రీలు నాలుగేళ్లకంటే ఎక్కువ సమయం తీసుకుంటాయి. పీహెచ్‌డీ కోర్సులు సగటున 5.7 సంవత్సరాలు కొనసాగుతాయి’ అని పేర్కొన్నారు.

వీసా పొడిగింపులపై అనిశ్చితి కారణంగా పరిశోధన ప్రయోగశాలలు, వైద్య శిక్షణా కార్యక్రమాలు, అంతర్జాతీయ విద్యార్థులపై ఆధారపడిన విశ్వవిద్యాలయాల కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉందని FIIDS హెచ్చరించింది. విద్యార్థులు మధ్యలోనే కోర్సులు నిలిపివేయాల్సి రావడం, పరిశోధన ప్రాజెక్టులు ఆలస్యం కావడం, అమెరికా పరిశోధన రంగానికి ప్రతిభావంతులైన విద్యార్థులు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా విద్యపై ఆశలు పెట్టుకున్న భారతీయ విద్యార్థులకు ఈ కొత్త నిబంధనలు కీలక మార్పులను తీసుకురానుండటంతో, రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపై అందరి దృష్టి నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *