Rohit Sharma : రోహిత్ శర్మ కొట్టిన షాట్‌కు గ్రౌండ్ స్టాఫ్‌కు గాయం.. వెంటనే హిట్‌మ్యాన్ ఏం చేశాడో తెలుసా?

Rohit Sharma : రోహిత్ శర్మ కొట్టిన షాట్‌కు గ్రౌండ్ స్టాఫ్‌కు గాయం.. వెంటనే హిట్‌మ్యాన్ ఏం చేశాడో తెలుసా?


Rohit Sharma : ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మైదానంలో సిక్సర్ల సునామీ సృష్టించడమే కాదు, మైదానం బయట తన మంచి మనసుతో అభిమానుల గుండెలు గెలుచుకోవడంలోనూ హిట్‌మ్యాన్ అనిపించుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కేవలం బ్యాట్‌తోనే కాదు, తన మానవత్వంతోనూ అందరినీ ఆకట్టుకున్నాడు. వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే?

లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ వాంఖడే స్టేడియంలో నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ సమయంలో రోహిత్ కొట్టిన ఒక పవర్‌ఫుల్ షాట్ నేరుగా వెళ్లి అక్కడ పని చేస్తున్న గ్రౌండ్ స్టాఫ్ సభ్యుడు సిబాన్ బిస్వాస్ మోకాలికి బలంగా తగిలింది. దీంతో అతను నొప్పితో విలవిలలాడాడు. ఇది గమనించిన రోహిత్ శర్మ వెంటనే ప్రాక్టీస్ ఆపేసి, కంగారుగా అతని దగ్గరకు పరుగెత్తుకెళ్లాడు. అతని గాయాన్ని పరిశీలించి, వెంటనే స్వయంగా ఐస్ ప్యాక్ తీసుకొచ్చి ఇచ్చాడు. అంతటితో ఆగకుండా, తన టీమ్ సభ్యుల ద్వారా అతనికి కావాల్సిన మందులు, పెయిన్ కిల్లర్ స్ప్రేలను పంపించి తన బాధ్యతను చాటుకున్నాడు.

గ్రౌండ్ స్టాఫ్ ఏమన్నారంటే?

ఈ ఘటన గురించి సిబాన్ బిస్వాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రోహిత్ శర్మ గొప్పతనాన్ని కొనియాడారు. “రోహిత్ సర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నెట్స్ నుంచి పక్కకు వెళ్లమని మమ్మల్ని హెచ్చరించారు. మేము పక్కకు తప్పుకున్నాం కానీ, రోప్స్ చుడుతున్నప్పుడు నేను బంతిపై దృష్టి పెట్టలేదు. ఆ బంతి వచ్చి నా మోకాలికి బలంగా తగిలింది. రోహిత్ సర్ వెంటనే నా దగ్గరకు వచ్చి గాయం గురించి ఆరా తీశారు. నేను సర్వసాధారణమేనని, మీరు ప్రాక్టీస్ కొనసాగించమని చెప్పినా.. ఆయన వినలేదు. స్వయంగా ఐస్ ప్యాక్ తెచ్చారు, ఆ తర్వాత ఇతరులతో మందులు కూడా పంపించారు” అని ఆనందం వ్యక్తం చేశారు.

రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్

గాయం కారణంగా దాదాపు 22 రోజుల పాటు ఆటకు దూరమైన రోహిత్ శర్మ, లక్నోపై ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చి తన ప్రతాపం చూపించాడు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ముంబైకి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్‌తో కలిసి తొలి వికెట్‌కు 143 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రికెల్టన్ కూడా 32 బంతుల్లో 83 పరుగులతో విరుచుకుపడటంతో, 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై కేవలం 18.4 ఓవర్లలోనే పూర్తి చేసింది.

ముంబై విజయ ప్రస్థానం

హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ముంబై ఈ విజయాన్ని సాధించింది. సూర్య (12) త్వరగా అవుట్ అయినప్పటికీ, నమన్ ధీర్ (23), విల్ జాక్స్ (10) చివరలో వేగంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. లక్నో బ్యాటర్ నికోలస్ పూరన్ 21 బంతుల్లోనే 63 పరుగులు చేసి ముంబైని భయపెట్టినప్పటికీ, రోహిత్ – రికెల్టన్ జోడీ లక్నో ఆశలపై నీళ్లు చల్లింది. ఈ గెలుపుతో ముంబై పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా, రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం అభిమానుల్లో కొత్త జోష్ నింపింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *