హైదరాబాద్, మే 5: తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల ప్రకటించిన అడ్మిషన్ల షెడ్యూల్ను బోర్డు తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 4వ తేదీన విడుదల చేసిన సర్క్యులర్ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ, ఇంటర్ బోర్డు ఈ ఏడాది విద్యా వ్యవస్థలో కొన్ని కీలకమైన సంస్కరణలు ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా విధానాన్ని అందించడంతో పాటు, అడ్మిషన్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఈ సంస్కరణలు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ మార్పుల కారణంగానే పాత షెడ్యూల్ను నిలిపివేసి, కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్, గురుకుల, మోడల్ జూనియర్ కళాశాలలు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని బోర్డు స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎటువంటి అడ్మిషన్లు నిర్వహించకూడదు.
కొత్త షెడ్యూల్ ఎప్పుడు?
సవరించిన అడ్మిషన్ల షెడ్యూల్తోపాటు పూర్తి స్థాయి నిబంధనలను అతి త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తామని బోర్డు తన ప్రకటనలో తెలిపింది. పదో తరగతి ఫలితాల అనంతరం అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. అడ్మిషన్ల ప్రక్రియలో వచ్చే మార్పుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం కోసం విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. ప్రభుత్వం తీసుకురాబోయే ఆ కొత్త సంస్కరణలు ఏమిటో అన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.