
నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు, ప్రాణాలకు తెగించి నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు హైదరాబాద్కు చెందిన ఒక సామాన్య ఆటో డ్రైవర్. తన ఆటోనే ఆయుధంగా మలచుకొని ఒక రౌడీ షీటర్ ఆగడాలను అడ్డుకున్న యువకుడి సాహసం ప్రస్తుతం భాగ్యనగరం అంతటా చర్చనీయాంశమైంది.
మార్చి 4వ తేదీ తెల్లవారుజామున బేగం బజార్ ప్రాంతంలో మంజు ఓమ్లతా అనే మహిళ తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లారు. హిందీ మర్వాడీ విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే, డబీర్పురాకు చెందిన పాత నేరస్థుడు, రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ పెనుగులాటలో నిందితుడి స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది.
అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్, ఈ దృశ్యాన్ని తన ఆటో సైడ్ వ్యూ మిర్రర్లో గమనించాడు. అప్పటికే 100 మీటర్లు ముందుకు వెళ్లినప్పటికీ, ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆటోను వెనక్కి తిప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్ను తన ఆటోతో బలంగా ఢీకొట్టి అతడిని కిందపడేశారు. నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నారు. వెంటనే గస్తీ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సాహసం చేసిన అనంతరం జాహెర్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే, అక్కడి సీసీటీవీ దృశ్యాల్లో జాహెర్ సాహసం రికార్డ్ అయ్యింది. బాధితురాలి సమాచారం మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, ఆటో నంబర్ ఆధారంగా జాహెర్ను గుర్తించారు. జాహెర్ సాహసాన్ని గుర్తించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ మంగళవారం (మే 05) ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు. బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీ కార్యాలయంలో జాహెర్కు ప్రశంసా పత్రం, నగదు పురస్కారాన్ని అందజేశారు.
“నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో, ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు” అని సీపీ సజ్జానార్ కొనియాడారు. ఇదిలావుంటే సదరు నిందితుడిపై గతంలో 16 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..