ORR Road Accidents: హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టే 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ప్రతి ఏడాది రోడ్డు సేఫ్ట్టి వారోత్సవాలు నిర్వహణ పేరుతో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలను మాత్రం అధికారులు నివారించలేకపోతున్నారు. arrive alive లాంటి కార్యక్రమాల్ ద్వారా రోడ్ సేఫ్టీ పై ప్రజలకు చాలా అవేర్నెస్ ఇచ్చినా ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్నాయి.
గడచిన ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై ప్రమాదాలు భారీగా చోటు చేసుకున్నాయి. 2022లో 1,020గా ఉన్న ప్రమాదాలు 2024 నాటికి 1,582కి పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో మరణాలు కూడా 170 నుండి 250కు పైగా పెరిగాయి. తాజాగా 2026 మే 1న శంషాబాద్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక రాచకొండ పోలీసుల గణాంకాల ప్రకారం 2025లో ORRపై ప్రమాదాలు గణనీయంగా పెరిగాయి. 2024లో 52 కేసులు నమోదు కాగా, 2025లో అవి 76కి చేరాయి. మరణాలు 21 నుండి 37కి పెరిగాయి. గాయాల సంఖ్యలో కూడా భారీ పెరుగుదల కనిపించింది. 31 నుండి 80కి పెరగడం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో స్పష్టంగా చూపిస్తోంది. సైబరాబాద్ పరిధిలో కూడా 2025లో 34 మరణాలు నమోదయ్యాయి. మొత్తం మీద అన్ని కమిషనరేట్లలో కలిపి 70కు పైగా మరణాలు సంభవించినట్లు అంచనా.
తెల్లవారుజామునే ప్రమాదాలు ఎక్కువ
మే 1, 2026న యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఆలయ దర్శనం ముగించుకొని హైదరాబాద్ వస్తున్న కుటుంబం వాహనం శంషాబాద్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. తీవ్ర ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమై, ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ అలసట కారణంగా నిద్రపోవడం ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ORRపై ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా అతివేగం, లేన్ డిసిప్లిన్ లోపం, అర్ధరాత్రి సమయంలో రాష్ డ్రైవింగ్, రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు లారీలు నిలిపివేయడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి అంశాలు గుర్తించబడ్డాయి. ముఖ్యంగా రాత్రి 3 నుంచి 6 గంటల మధ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.. ఔటర్ పై ఉన్న నాలుగు లేన్స్ లో 1,2 లేన్ లలో కార్లు వెళ్తాయి. ఈ లేన్ లలో వెళ్లే వాహనాల స్పీడ్ 120 నుండి 140 మద్యలో ఉంటుంది.
నిబంధనలకు విరుద్దంగానే..
ఇక 3,4 లేన్ లలో ఎక్కువగా లారీలు వెళుతుంటాయి. ఇవి 80 నుండి 100 స్పీడ్ లో ఉంటాయి. కార్లు 140 స్పీడ్ తో లేన్ లు మారినప్పుడు ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలను పార్క్ చేయడం అనేది నిబంధనలకు విరుద్ధం. అవుటర్ ఎమర్జెన్సీ లేన్ ఉన్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో పార్క్ చేయవలసి వస్తే ఖచ్చితంగా పార్కింగ్ లైట్లు ఆన్ చేయాలి. కానీ చాలామంది లారీ డ్రైవర్లు ఈ నిబంధనను పట్టించుకోకుండానే ఇష్టానుసారంగా ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలను పార్క్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పై ఎక్కువ ప్రమాదాలు ఆగి ఉన్న వాహనం ను డీ కొట్టడంతోనే అవుతున్నాయి.
పోలీసుల చర్యలు
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ‘జీరో యాక్సిడెంట్ యాక్షన్ ప్లాన్’ను అమలు చేయడానికి సిద్ధమైంది. అండర్పాస్ల వద్ద సీసీటీవీ నిఘా, రూల్స్ ఉల్లంఘించే వారిపై ఆటోమేటిక్ జరిమానాలు, వేగ నియంత్రణ, రాత్రిపూట పెట్రోలింగ్ బలోపేతం వంటి చర్యలు తీసుకోనున్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దు చేసే చర్యలు కూడా ప్రతిపాదించారు.
గత ఐదేళ్లలో ORRపై 375 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కఠిన చర్యలు, అవగాహన కార్యక్రమాలు, రోడ్డు నిర్మాణ లోపాల సవరణ లేకపోతే ORR మరిన్ని ప్రాణాలను బలి తీసుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి