కావలసిన పదార్థాలు:
రొయ్యలు (శుభ్రం చేసినవి)
బియ్యం (వండిన అన్నం)
నూనె, నెయ్యి
బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు
చిన్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్
అల్లం వెల్లుల్లి పేస్ట్
కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి
జీడిపప్పు, కొత్తిమీర
నిమ్మరసం, ఉప్పు
రొయ్యల శుభ్రత
రొయ్యలను వండే ముందు వాటి చర్మం పైన ఉండే నల్లటి పేగును(Vein) తప్పనిసరిగా తొలగించాలి. పేగును సరిగ్గా తీయకపోతే వంటకం చేదుగా మారుతుంది, కాబట్టి శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపుతో కడిగితే నీచు వాసన రాకుండా ఉంటుంది.
తయారీ విధానం
ముందుగా పొయ్యి మీద మట్టి కుండ లేదా వెడల్పాటి పాత్రను పెట్టి నూనె వేయండి. అందులో బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, పచ్చిమిర్చి జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత తరిగిన చిన్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు వేయించాలి. ఇప్పుడు కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలిపి, కొద్దిగా నీరు సరిపడా ఉప్పు చేర్చి మసాలాను ఉడికించాలి.
రొయ్యల మసాలా
మసాలా ఉడుకుతున్నప్పుడు శుభ్రం చేసిన రొయ్యలను వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. రొయ్యలు త్వరగా ఉడుకుతాయి కాబట్టి ఎక్కువ సేపు ఉంచక్కర్లేదు. రొయ్యలు ఉడికిన తర్వాత మిరియాల పొడి, నిమ్మరసం చల్లి బాగా వేయించాలి. చివరిగా ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఈ రొయ్యల మసాలాలో వేసి, కొద్దిగా నెయ్యి, కొత్తిమీర చల్లి అన్నానికి మసాలా పట్టేలా బాగా కలపాలి. రెండు నిమిషాలు తక్కువ మంట మీద ఉంచి దించేస్తే వేడి వేడి రొయ్యల సత్తి రైస్ సిద్ధం. ఈ రొయ్యల వేపుడు అన్నం తయారీలో మట్టి పాత్రను వాడటం వల్ల ప్రత్యేకమైన సువాసన వస్తుంది. తక్కువ సమయంలోనే రెస్టారెంట్ స్థాయి రుచిని ఇంట్లోనే ఆస్వాదించవచ్చు.