
గతంలో ఆదివాసీలకు ఇచ్చిన హామీని మంత్రి జూపల్లి నిలబెట్టుకున్నారు. సుమారు 200 మంది ఆదీవాసులను ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ పేరుతో హైదరాబాద్ సందర్శనకు తీసుకెళ్లారు. అయితే గతంలో ఉట్నూరు మండలం కుమ్మరికుంటలో పర్యటించిన సందర్భంలో, అక్కడి ఆదివాసీలతో ముచ్చటించిన మంత్రి.. మిమ్మల్ని హైదరాబాద్కు తీసుకెళ్లి, అక్కడి అభివృద్ధిని, చారిత్రక కట్టడాలను చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ పేరుతో ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 6 గంటలకు ఉట్నూరు మండలం గొండుగూడలో జెండా ఊపి ఈ విజ్ఞాన యాత్రను మంత్రి జూపల్లి స్వయంగా ప్రారంభించారు.
దీంతో గోండు గూడ నుంచి 5 బస్సుల్లో సుమారు 200 మంది ఆదివాసీలు హైదరాబాద్కు బయల్దేరారు. వీరంతా మధ్యాహ్యం 1 గంటకు హైదరాబాద్ లోని తారామతి బారాదరికి చేరుకోని రెండు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. ఈ రెండ్రోజుల్లో నగరంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు. కేవలం పర్యాటక ప్రదేశాలను చూడటమే కాకుండా, ఆదివాసీలు ప్రపంచ పోకడలను, ఆధునిక అభివృద్ధిని, చారిత్రక వారసత్వాన్ని దగ్గరగా గమనించాలన్నది మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన సంకల్పం. రివర్స్ టూరిజంలో భాగంగా ఆదివాసీల సంస్కృతికి నగర నాగరికతకు మధ్య వారధిని నిర్మించాలన్న ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు
ఈ నెల 22 నుంచి 26 వరకు మొదటి విడత పర్యటన
ఈ విజ్ఞాన యాత్రను మొత్తం మూడు విడతలుగా రూపకల్పన చేశారు. ఏప్రిల్ 22 నుంచి 26 వరకు సాగే ఈ పర్యటనలో ఒక్కో బ్యాచ్కు 200 నుండి 250 మంది చొప్పున మూడు బ్యాచ్లుగా హైదరాబాద్ను సందర్శిస్తారు. వీరి సౌకర్యార్థం మంత్రి ఆదేశాల మేరకు 5 ప్రత్యేక ఏసీ బస్సులను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. ఈ టూర్లో భాగంగా ఆదివాసీలు హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ కోట, తారామతి బరాదరి, లుంబినీ పార్క్, శిల్పారామం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.