ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో మరో గ్రీన్ఫీల్డ్ హైవేకు నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కొత్త హైవే నిర్మించనుంది. నెల్లూరు కృష్ణపట్నం నుంచి కడప జిల్లా బద్వేల్ వరకు నాలుగు లైన్ల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పనులను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) టెండర్లను ఆహ్వానించింది. ఈ 29న టెండర్లను ఓపెన్ చేయనుండగా.. అనంతరం కాంట్రాక్ట్ సంస్థను ఖరారు చేసి పనులు ప్రారంభించనున్నారు.
ఆరు నెలల్లో హైవే పనులు
రాబోయే ఆరు నెలల్లో పనులను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు నుంచి కడప జిల్లా బద్వేల్ వరకు 108 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇందుకు దాదాపు రూ.3,397 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం కృష్ణపట్నం-బద్వేల్ మధ్య దూరం 142 కి.మీ ఉండగా.. ఈ హైవే పూర్తయితే 108.13 కిలోమీటర్లకు తగ్గుతుంది. దీంతో ప్రయాణం 34 కిలోమీటర్లకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. దాదాపు గంట ప్రయాణ సమయం తగ్గుతుందని చెబుతున్నారు. అయితే ఈ హైవేను డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్ ఫర్ విధానంలో నిర్మించనున్నారు. ఇక ఈ హైవే పూర్తయితే నెల్లూరు నగరంలో ట్రాఫిక్ భారీగా తగ్గుతుంది. చెన్నై నుంచి ఉదయగిరి, ఆత్మకూరు వైపు వెళ్లేవారికి వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.
అటవీశాఖ అనుమతులు పెండింగ్
కడప జిల్లా గోపవరం ఎన్హెచ్-97ను కృష్ణపట్నం పోర్టు నేషనల్ హైవే 16తో గ్రీన్ ఫీల్డ్ హైవే కలపనుంది. దీని వల్ల రాయలసీమ ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ పెరగనుందని చెప్పవచ్చు. ఇక హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్కు కూడా కనెక్టివిటీ లభిస్తుంది. అయితే ఈ హైవే నిర్మాణానికి భూసేకరణ కోసం ఇప్పటికే రూ.255 కోట్లు విడుదల చేశారు. ఇక అటవీశాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతం నుంచి హైవే నిర్మించాల్సి ఉండటంతో అటవీశాఖ అనుమతులు తప్పనిసరి అయ్యాయి. త్వరలోనే అటవీశాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. అనుమతుల కోసం ఇప్పటికే అధికారులు దరఖాస్తు కూడా చేశారు.