హైదరాబాద్, జులై 23: ముత్యం వెంకటరమణ ఇంట్లో సుమారు 14 గంటల పాటు సోదాలు నిర్వహించిన ఏసీబీ.. సోదాల అనంతరం వెంకటరమణను ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. తెలంగాణ పునరుత్పాదక ఇంధన సంస్థలో డీజీఎంగా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణ 2019లోనే డిసెంబరు 12న రూ.25వేల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డాడు. అదే రోజు వెంకటరమణ ఇంట్లో సోదాలు చేసి రూ.26 లక్షలు ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఈ కేసు విచారణ కోర్టులో ఉండగా, మరోసారి డీఏ కేసులో ఏసీబీ సోదాలు నిర్వహించింది.
ఎసీబీ సోదాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 28 కోట్ల రూపాయల ఆస్తులను అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వెంకటరమణ ఆస్తుల విలువ 200 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా. తన భార్య పేరిట నాలుగు రియల్ ఎస్టేట్ సంస్థలను ముత్యం వెంకటరమణ స్థాపించాడు. ముత్యం కన్స్ట్రక్షన్స్, ముత్యం బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ముత్యం ఏఎన్ఎస్ ఆర్ కన్స్ట్రక్షన్స్, ప్రైడ్ హోమ్స్ పేరిట ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ముత్యం వెంకటరమణ ఆడిటర్ ఇంట్లోనూ సోదాలు చేసి కీలక సమాచారాన్ని ఏసీబీ సేకరించింది. మూసాపేట ఆంజనేయ నగర్ లో 20 కోట్ల రూపాయల విలువైన ప్లాట్లు, మాదాపూర్ గుట్టల బేగంపేటలో ఐదంతస్తుల భవనం, కూకట్పల్లి ఆంజనేయ నగర్ లో 160 చదరపు గజాలలో మూడంతస్తుల భవనం, శేరిలింగంపల్లి, కూకట్పల్లిలో నాలుగు ఫ్లాట్లు, నాలుగు బ్యాంకు ఖాతాలలో 52 లక్షల రూపాయల నగదు, బ్యాంకు లాకర్లలో 40 లక్షల రూపాయల విలువైన 2094 గ్రాముల బంగారు ఆభరణాలు, 30 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, 19 విదేశీ మద్యం బాటిల్లను ACB స్వాధీనం చేసుకుంది.
అక్రమాస్తుల కేసులో ఏసీబీ DE ముత్యం వెంకటరమణ అరెస్ట్ చేసింది. ఏసీబీ చరిత్రలో అతిపెద్ద అవినీతి అధికారి ముత్యమేనని అధికారులు తెలిపారు. భారీగా ఆస్తులను కూడబెట్టిన ముత్యం వెంకటరమణ ఓవైపు అధికారం.. ఇంకోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగించాడు. భార్య పేరిట 4 నిర్మాణ సంస్థలు,10 అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాలు.. ముత్యం అవినీతి చిట్టా చూసి ఏసీబీ అధికారులకు దిమ్మతిరిగి పోయింది. హైదరాబాద్ మాదాపూర్ మీనాక్షి స్కైలాంజ్ టవర్స్లోని వెంకటరమణ ఇంటికి ఉదయమే ఏసీబీ సిటీ రేంజ్-2 డీఎస్పీ మాజిద్ఖాన్ నేతృత్వంలోని బృందాలు చేరుకొని సోదాలు నిర్వహించాయి. అలాగే ప్రస్తుతం ఆయన పనిచేస్తున్న ఖైరతాబాద్లోని రెడ్కో కార్యాలయంతోపాటు హైదరాబాద్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏక కాలంలో 9 ప్రాంతాల్లో 14 గంటల పాటు సాగిన సోదాల్లో కీలక డాక్యుమెంట్స్, నగదు, బంగారం స్వాధీనం, లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, లగ్జరీ కార్లు చేసుకున్నారు. ముత్యంపై ఎక్సైజ్ శాఖలోనూ కేసు నమోదైంది. ఇప్పటివరకు పట్టుబడ్డ ఆస్తుల విలువ రూ.28.14 కోట్లుగా తేలింది. మార్కెట్ విలువ రూ.200 కోట్లకుపైగానే అంటుందని అధికారులు తెలిపారు. అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో మరోవైపు స్థిరాస్తి నిర్మాణరంగ వ్యాపారిగానూ అవతారమెత్తినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.
ఇవి జస్ట్ మచ్చుకు మాత్రమే. ఇంకా ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఇంకా బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. 65ఏళ్ల ఏసీబీ చరిత్రలో అతిపెద్ద అవినీతి అధికారి ముత్యం వెంకటరమణే అంటున్నారు అధికారులు. ఈరేంజ్లో ఆస్తులను ఎలా కూడబెట్టారన్నదానిపై ఏసీబీ విచారణ సాగుతోంది. వందల కోట్ల రూపాయలు ముత్యం అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ భావిస్తోంది.