మల్లె మొక్కలను కొమ్మల కటింగ్స్ ద్వారా విజయవంతంగా పెంచడం ఒక సులభమైన ప్రక్రియ. 100% విజయం సాధించడానికి, మల్లెపూలు బాగా పూయడానికి చిన్న చిన్న చిట్కాలు చాలా ఉపయోగపడుతాయి. కొన్ని పద్దతులు పాటించడం ద్వారా, మీ మల్లె మొక్కలు చక్కగా వేళ్ళు తొడిగి, పెరగడానికి సిద్ధంగా ఉంటాయి. అంతేకాకుంవడా పూలు కూడా బస్తాలు కొద్ది పూస్తాయి.. మల్లెమొక్క బాగా పెరగడానికి ముందుగా, కొమ్మల ఎంపిక చాలా కీలకం. ముద్ద మల్లెలు, సింగిల్ పెటల్స్, డబుల్ పెటల్స్, తీగ జాతులు వంటి వివిధ రకాల మల్లె మొక్కల నుండి మీరు ఇష్టపడే కొమ్మలను ఎంచుకోవచ్చు. కొమ్మలను కణుపుల కింద నుండి సుమారు ఒకటి నుండి రెండు అంగుళాల పొడవున క్రాస్గా కట్ చేయాలి. కణుపులు వేళ్ళు ఏర్పడటానికి ముఖ్యమైనవి, కాబట్టి కటింగ్స్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కణుపులు ఉండేలా చూసుకోవాలి. కటింగ్స్కు ఉన్న ఆకులు, పువ్వులు, మొగ్గలు అన్నీ తొలగించాలి. మొక్క శక్తి వేళ్ళు రావడానికి ఉపయోగపడేలా ఇది సహాయపడుతుంది. వేళ్ళు త్వరగా రావడానికి, కణుపు భాగంలో పైపొరను సన్నని బ్లేడ్తో సున్నితంగా గీకాలి. సుమారు రెండు అంగుళాల వరకు ఈ విధంగా చేయాలి.
కొమ్మలను నాటడానికి ముందు, రూటింగ్ హార్మోన్ను ఉపయోగించడం వల్ల విజయవంతమయ్యే అవకాశం గణనీయంగా పెరుగుతుంది. సహజ రూటింగ్ హార్మోన్గా కలబందను ఉపయోగించవచ్చు, లేదా అమెజాన్ వంటి ఆన్లైన్ స్టోర్లలో లభించే వాణిజ్య రూటింగ్ హార్మోన్ పౌడర్ను కూడా వాడవచ్చు. కొమ్మలను ముందుగా కలబంద రసంలో డిప్ చేసి, ఆ తర్వాత రూటింగ్ హార్మోన్ పౌడర్లో కణుపు భాగం వరకు అంటుకునేలా చేయాలి.
నాటడానికి బరక ఇసుకను ఉపయోగిస్తారు, ఇది ఉత్తమమైన మీడియం. డ్రైనేజీ రంధ్రాలున్న కంటైనర్ను ఎంచుకుని, రంధ్రాల నుండి ఇసుక బయటకు వెళ్ళకుండా చిన్న కంకరతో కప్పాలి. ఆ తర్వాత కంటైనర్లో బరక ఇసుకను నింపాలి. ఫంగస్ రాకుండా నివారించడానికి, ఒక లీటరు నీటిలో అర స్పూన్ సాఫ్ ఫంగిసైడ్ను కలిపి ఈ ఇసుకలో పోయాలి. ఇసుక బాగా తడిసి, నీరు కిందకు వెళ్ళిపోయే వరకు రెండుసార్లు పోయాలి.
ఇసుక తడిచిన తర్వాత, కొమ్మలను నాటడానికి ఒక చిన్న కర్ర లేదా ఇనుప కడ్డీతో రంధ్రాలు చేయాలి. కణుపులు లోపలికి వెళ్ళేలా కొమ్మలను రంధ్రాలలో జాగ్రత్తగా దించాలి. కొమ్మలు గాలికి కదలకుండా చుట్టూ ఇసుకను గట్టిగా అదిమివేయాలి. నాటిన తర్వాత, కంటైనర్ను నేరుగా సూర్యరశ్మి పడని నీడ ప్రాంతంలో ఉంచాలి. ఇసుక ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి, కానీ అధికంగా నీరు నిలవకుండా జాగ్రత్తపడాలి.
కొత్త చిగుర్లు – ఆకులు వచ్చేవరకు మొక్కలను కదిలించకూడదు. కొత్త ఆకులు వచ్చిన తర్వాత, మొక్కలను మార్పిడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం. మార్పిడి చేసేటప్పుడు, వేళ్ళు దెబ్బతినకుండా జాగ్రత్తపడాలి. కంటైనర్ను పక్కకు వంచి, మెల్లగా కొట్టడం ద్వారా ఇసుక రాలిపోతుంది, అప్పుడు వేళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి. నాటుకోవడానికి గతంలో తయారుచేసుకున్న సాయిల్ మిక్స్ చాలా అనుకూలంగా ఉంటుంది.
మార్పిడి చేసిన తర్వాత, మొక్కలను వెంటనే ఎండలోకి తీసుకురాకూడదు. మొదట వారం నుండి పది రోజులు నీడలో, ఆ తర్వాత మరో వారం నుండి పది రోజులు సెమీ షేడ్లో ఉంచాలి. సుమారు ఇరవై రోజుల తర్వాత, మొక్కలను డైరెక్ట్ ఎండలోకి మార్చవచ్చు. ఈ పద్ధతి ద్వారా మల్లె మొక్కలు వాతావరణానికి చక్కగా అలవాటు పడి, ఆరోగ్యంగా పెరుగుతాయి.
మల్లె పూలు బాగా పూయాలంటే..
ఆ తర్వాత.. పూలు బాగా పూయాలంటే.. కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మల్లె మొక్కలు విరగబూయాలంటే, ముఖ్యంగా బీట్రూట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ లేదా అరటి తొక్కల నీటిని ఎరువుగా వాడటం మంచిది. రోజుకు 5-6 గంటల ప్రత్యక్ష సూర్యరశ్మి ఉండేలా చూసుకోవాలి. అదనంగా ఎండిన కొమ్మలను కత్తిరించడం (Pruning), నీరు పోయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. దీంతోపాటు.. మొక్క బుషీగా బాగా పెరుగుతుంది.