శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ వ్యాప్తంగా సుమారు రూ.1,28,563 కోట్ల విలువైన అభివృద్ది పనులను చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. రూ.12,980 కోట్లతో భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతదేశ సముద్ర వాణిజ్యాన్ని అంతర్జాతీయ అనిశ్చితుల నుండి రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే విశాఖ-రాజమండ్రి 3,4 రైల్వే లైన్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 2 శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ. 6,791 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. అలాగే ప్రధాని గ్రామీణ్ సడక్ యోజన పథకాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించాలని.. ఇందుకోసం రూ. 83,977 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ప్రాజెక్ట్లు, విస్తరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఘజియాబాద్ – సీతాపూర్ 3వ, 4వ రైలు మార్గం కోసం రూ. 14,926 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది.
ఈ సందర్భంగా రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. విశాఖ -రాజమండ్రి 3,4 రైల్వే లైన్ల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్కు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. రూ.9,889 కోట్లతో ఈ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టినట్టు ప్రకటించారు . ఏపీ లోని మూడు పోర్ట్లను కలుపుతూ ఈ రైల్వే లైన్ల నిర్మాణాన్ని చేపట్టినట్టు వెల్లడించారు. గోదావరి నదిపై కొత్తగా నాలుగు కిలోమీటర్ల మేర భారీ వంతెన నిర్మిస్తామని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.