
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న దృశ్యాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడబోతుందనే ఒక చిన్న పుకారు కార్చిచ్చులా వ్యాపించడంతో జనం బంకుల వైపు పరుగులు తీస్తున్నారు. ఆందోళన మనిషి విచక్షణను ఎలా దెబ్బతీస్తుందో ఈ క్యూలైన్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతాయన్న వార్తలను జనం తమకు తోచినట్లుగా అర్థం చేసుకున్నారు. దీనికి తోడు సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారం తోడవ్వడంతో, రేట్లు పెరుగుతాయేమో లేదా స్టాక్ అయిపోతుందేమో అన్న భయంతో లీటరు పట్టించుకోవాల్సిన చోట ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నారు. వైజాగ్ నుంచి వరంగల్ వరకు ప్రతిచోటా ఇదే పరిస్థితి.
పరిస్థితి తీవ్రతను గమనించిన తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు పానిక్ కావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సరఫరాను పర్యవేక్షించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అటు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేసి, కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు చేపట్టారు.
మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో ఎక్కడా షార్టేజ్ లేదని, రేట్లు పెరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వాలు పదేపదే చెబుతున్న మాట ఒక్కటే.. “ఆయిల్ ఉంది.. ఆందోళన వద్దు”. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం వల్ల నిజంగా అవసరమున్న వారికి ఇబ్బంది కలగడమే కాకుండా, అనవసరపు రద్దీకి కారణమవుతుంది. విజ్ఞప్తిని మన్నించి, వదంతులను పక్కన పెట్టి సాధారణ స్థితికి సహకరించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజలపైనే ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..