Ravi Shastri Comments Team India Bowling Squad: మెగా టోర్నీకి ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది. అయినా సరే భారత క్రికెట్ జట్టు యాజమాన్యం సరైన బౌలింగ్ దళాన్ని సిద్ధం చేసుకోలేకపోయింది. బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగానే కనిపిస్తున్నా, బౌలింగ్ యూనిట్ మాత్రం దారుణంగా తేలిపోతోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్లు బ్యాటింగ్ భారాన్ని మోసినా, బౌలర్లు విఫలమైతే విజయం సాధించడం అసాధ్యం. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే మాజీ కోచ్ రవిశాస్త్రి బోర్డు పెద్దలకు, టీం మేనేజ్మెంట్కు ఓ కీలక సందేశం పంపాడు.
గాయాల పాలవుతున్న స్టార్ పేసర్..
భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ ప్రస్తుతం అందరినీ తీవ్రంగా కలవరపెడుతోంది. అతడు మైదానంలోకి దిగితే ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టడం ఖాయం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒకటి లేదా రెండు మ్యాచ్లు ఆడిన వెంటనే అతను గాయాల బారిన పడుతున్నాడు. కోలుకోవడానికి నెలల తరబడి సమయం తీసుకుంటున్నాడు. తీరా మెగా టోర్నీ సమయానికి బుమ్రా గాయం తిరగబెడితే జట్టు పరిస్థితి ఏమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కేవలం అతనిపైనే పూర్తిగా ఆధారపడి వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ బరిలోకి దిగితే మొదటికే మోసం వస్తుందని రవిశాస్త్రి హెచ్చరిస్తున్నాడు. బౌలింగ్ భారాన్ని పంచుకునే సరైన భాగస్వాములు అతనికి తోడుగా ఉండాలని స్పష్టం చేశాడు.
ఇది కూడా చదవండి: ముగిసిన జింబాబ్వే సిరీస్.. వైభవ్ సూర్యవంశీ మళ్లీ మైదానంలోకి దిగేది ఎప్పుడో తెలుసా?
ఆల్రౌండర్ల కొరత..
బౌలింగ్ సమస్యలతో పాటు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ల కొరత జట్టును వేధిస్తోంది. స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా లాంటి మ్యాచ్ విన్నర్ జట్టులో ఉండటం ఎంత అవసరమో అందరికీ తెలుసు. అయితే పదే పదే ఫిట్నెస్ సమస్యలు అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి. కీలక సమయాల్లో అతను జట్టుకు దూరమవ్వడం కూర్పును దెబ్బతీస్తోంది. అతనికి సరైన ప్రత్యామ్నాయాన్ని వెతకడంలో మేనేజ్మెంట్ ఘోరంగా విఫలమైంది. వెంకటేష్ అయ్యర్ రూపంలో ఓ ఆశాకిరణం కనిపించినా, అతన్ని సరైన రీతిలో వాడుకోలేకపోయారు. ఇలాంటి కీలక లోపాలతో వరల్డ్ కప్కు వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.
యువకులపై మోజు..
హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ లాంటి యువ పేసర్లకు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. కానీ వారి ప్రదర్శనలో ఏమాత్రం నిలకడ లేదు. ఇటీవలే ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్ ఈ లోపాన్ని మరింత స్పష్టంగా ఎత్తిచూపింది. తొలి వన్డేలో గెలిచిన టీమిండియా, ఆ తర్వాతి రెండు మ్యాచ్లలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అనుభవలేమి కారణంగానే యువ బౌలర్లు చేతులెత్తేశారు. ఆఖరి మ్యాచ్కు బుమ్రా సైతం అందుబాటులో లేకపోవడం జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. వన్డే ఫార్మాట్లో 10 ఓవర్ల పాటు ఏకాగ్రతతో బౌలింగ్ చేయాలంటే కేవలం వేగం ఉంటే సరిపోదు, అపారమైన మ్యాచ్ రీడింగ్ అనుభవం కూడా తోడు కావాలి.
ఇది కూడా చదవండి: టీమిండియా ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. స్టార్ ఆల్రౌండర్ రెడీ.. వేటకు సిద్ధమంటూ సిగ్నల్..!
షమీ, భువీ ఎంట్రీతోనే అద్భుతాలు..!
ఈ పరిణామాల నేపథ్యంలో రవిశాస్త్రి చేసిన సూచనలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. వన్డే వరల్డ్ కప్ 2027 బరిలోకి దిగే జట్టులో సీనియర్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ కచ్చితంగా ఉండి తీరాలని ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. స్వింగ్ కింగ్ భువీకి పవర్ ప్లేలో వికెట్లు తీయడం వెన్నతో పెట్టిన విద్య. ఇక మహమ్మద్ షమీ సీమ్ పొజిషన్, డెత్ ఓవర్లలో అతను సంధించే యార్కర్లు జట్టుకు ఎంతో కీలకం కానున్నాయి. వీరిద్దరితో పాటే మహమ్మద్ సిరాజ్, స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్లను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాలని శాస్త్రి కుండబద్దలు కొట్టాడు.
ప్రపంచకప్ లాంటి భారీ టోర్నీల్లో ఒత్తిడిని జయించాలంటే కుర్రాళ్ల ఉత్సాహం కంటే దిగ్గజాల అనుభవమే ఎక్కువ పనిచేస్తుంది. రవిశాస్త్రి వాస్తవిక విశ్లేషణను పరిగణనలోకి తీసుకుని బీసీసీఐ పెద్దలు భువనేశ్వర్, షమీలకు మళ్లీ పిలుపునిస్తారో లేక కుర్రాళ్లతోనే సాహసం చేస్తారో వేచి చూడాలి. సరైన బౌలింగ్ కూర్పును సెట్ చేసుకుంటేనే కప్పు కల నెరవేరుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..