భారతీయ రైల్వే ప్రయాణ అనుభూతిని మరింత విలాసవంతంగా మార్చే దిశగా కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వందే భారత్ ఎక్స్ప్రెస్, వందే భారత్ స్లీపర్ రైళ్లను పనిచేస్తున్నారు. త్వరలో ముంబై–బెంగళూరు వందే భారత్ స్లీపర్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ కోచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కోచ్ను చూసిన నెటిజన్లు దీనిని పట్టాలపై నడిచే ఫైవ్ స్టార్ హోటల్ అంటూ ప్రశంసిస్తున్నారు.
వందే భారత్ స్లీపర్లోని ఫస్ట్ ఏసీ కోచ్లో ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేశారు. ఆధునిక ఇంటీరియర్స్, ప్రీమియం ఫినిషింగ్, మెరుగైన లైటింగ్, మరింత వ్యక్తిగత గోప్యత కలిగిన కేబిన్లు, విశాలమైన బెర్త్లు ఈ కోచ్ ప్రత్యేకతలు. సంప్రదాయ స్లీపర్ రైళ్లలో కనిపించే సాధారణ వాతావరణానికి భిన్నంగా, ఈ కోచ్లో హోటల్ గదిని తలపించేలా డిజైన్ రూపొందించారు.
వందే భారత్ స్లీపర్ రైళ్లు ముఖ్యంగా సుదూర రాత్రి ప్రయాణాలను మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు రూపొందించబడ్డాయి. ఫస్ట్ ఏసీతో పాటు సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్లు కూడా ఆధునిక సదుపాయాలతో అందుబాటులో ఉండనున్నాయి. ఆటోమేటిక్ డోర్లు, బయో-వాక్యూం టాయిలెట్లు, మెరుగైన లైటింగ్, ఛార్జింగ్ పాయింట్లు, రీడింగ్ లైట్లు, సీసీటీవీ వంటి ఆధునిక సదుపాయాలు ఉంటాయి.
ముంబై – బెంగళూరు వందే భారత్ స్పీపర్ ఫస్ట్ ఏసీ వీడియో
ముంబై–బెంగళూరు మార్గంలో ఈ వందే భారత్ స్లీపర్ ప్రారంభమైతే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, ప్రయాణ అనుభవం కూడా కొత్త రేంజ్కి చేరుతుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది.