Headlines

‘నేను యావరేజ్‌ స్టూడెంట్‌ మాత్రమే..’ NEET రీ-టెస్ట్‌లో ఆశించిన మార్కులు రాలేదనీ విద్యార్ధిని సూసైడ్

‘నేను యావరేజ్‌ స్టూడెంట్‌ మాత్రమే..’ NEET రీ-టెస్ట్‌లో ఆశించిన మార్కులు రాలేదనీ విద్యార్ధిని సూసైడ్


నాసిక్, జులై 28: నీట్ (NEET) రీ-ఎగ్జామినేషన్‌లో ఆశించిన మార్కులు రాలేదని ఓ విద్యారిని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జలాల్‌పూర్ గ్రామానికి చెందిన అంకితా సంగ్లే (19) అనే విద్యార్థిని తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. ఘటన జరిగిన సమయంలో అంకిత తల్లిదండ్రులు, అన్న ఆషాఢం ఏకాదశి సందర్భంగా పాంఢర్‌పూర్‌కు వెళ్లగా, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. శనివారం సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో సమీప బంధువులు ఇంటికి వెళ్లి చూడగా.. ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సూసైడ్ నోట్‌లో ఏముంది?

ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్‌లో అంకిత తన మరణానికి కారణాన్ని వివరించినట్లు పోలీసులు తెలిపారు. నీట్ రీ-ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులతో తీవ్ర నిరాశకు గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె అందులో రాసినట్లు వెల్లడించారు. అలాగే తన తల్లిదండ్రులు, అన్నకు క్షమాపణలు చెబుతూ, వారి అంచనాలను అందుకోలేకపోయానని, తాను ఒక సాధారణ విద్యార్థినినని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అంకిత నీట్ రీ-ఎగ్జామ్‌లో 166 మార్కులు సాధించగా, అర్హత కట్‌ఆఫ్ 177 మార్కులుగా ఉంది. ఈ ఏడాది మే నెలలో జరిగిన అసలు పరీక్షలో ఆమె మంచి మార్కులు సాధించినట్లు సమాచారం. అయితే జూన్ 21న జరిగిన పునఃపరీక్షలో అంకిత కేవలం 166 మార్కులు మాత్రమే సాధించగలిగింది. ఈ తేడా కారణంగా అంకిత తీవ్ర నిరాశకు లోనైనట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ హనుమాన్ గైక్వాడ్ తెలిపారు. జూలై 25వ తేదీ రాత్రి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.

నీట్-యూజీ 2026 రద్దు, జూన్ 21న జరగనున్న దేశవ్యాప్త పునఃపరీక్ష మధ్య వారాలలో, దేశవ్యాప్తంగా12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కాగా నీట్ రీ ఎగ్జాం ఫలితాలు విడుదలైన తర్వాత జరిగిన రెండో విషాద ఘటన ఇది. గత జూన్ 20న నాసిక్ జిల్లాకు చెందిన యశ్ గోసావి (21) కూడా నీట్ రీ-టెస్ట్‌కు ఒక రోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశ్నాపత్రం లీక్, రీ-ఎగ్జామ్ వ్యవహారంతో తీవ్ర ఆందోళనకు గురైనట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

నోట్‌: పరీక్షల్లో వచ్చిన ఫలితాలు జీవితానికి అంతిమ నిర్ణయం కావు. ఒత్తిడి, ఆందోళన లేదా నిరాశ ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడటం మంచిది. సమయానికి సహాయం కోరడం ధైర్యమైన నిర్ణయం అవుతుంది. విద్యార్థులు ఒక్క అపజయంతో ఆశలు వదులుకోవద్దని, కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలని, విజయం కోసం పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *