రైతులంటే సామాన్యులు కాదు.. పట్టాలేని పట్టభద్రులు రైతులు…ఆరుగాలం శ్రమించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి ఆహారాన్ని అందించే అన్నదాత. ఓవైపు ప్రకృతి వైపరిత్యాలు అన్నదాతను అష్టకష్టాలు పెడుతున్నా.. వాటన్నిటినీ తట్టుకొని పంటసాగుచేస్తుంటే.. అన్నదాతల శ్రమను దోచుకునేందుకు తయారవుతున్నారు కొందరు. రైతులు పొలాల్లో ఏర్పాటుచేసుకున్న విద్యుత్ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లలో ఉండే కాపర్ వైర్లను ఎత్తుకెళ్లిపోతూ రైతుకు తీరని నష్టం కలిగిస్తున్నారు. ఇలాంటి దొంగల ఆట కట్టించాలని నిర్ణయించుకున్న రైతులు వినూత్నంగా ఆలోచించారు. తమ నైపుణ్యానికి సాంకేతికతను జోడించి దొంగల ఆటకట్టించారు. ‘మోషన్ డిటెక్షన్ సీసీ కెమెరాల’ సాయంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. జిల్లాలోని మొరంచవాగు పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా వరుస చోరీలతో రైతులు బెంబేలెత్తిపోయారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని భావించిన రైతులంతా ఏకమై, పొలాల వద్ద అత్యాధునిక మోషన్ డిటెక్షన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి దొంగలు తమ పాత బుద్ధినే ప్రదర్శిస్తూ చోరీకి ప్రయత్నించారు. అయితే, ఆ ప్రాంతంలో దొంగల కదలికలను గుర్తించిన కెమెరాలు క్షణాల్లో రైతుల మొబైల్ ఫోన్లకు ‘అలర్ట్ మెసేజ్’ పంపాయి. ఒక్క మెసేజ్తో అప్రమత్తమైన రైతులందరూ క్షణాల్లో ఏకమై పొలాల వద్దకు చేరుకున్నారు. రైతులు చుట్టుముట్టడంతో తప్పించుకునే దారిలేక ఇద్దరు దొంగలు అడ్డంగా దొరికిపోయారు. ఆగ్రహించిన రైతులు వారిని విద్యుత్ స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని దొంగల బెడద నుంచి విముక్తి పొందిన ఈ రైతుల తెలివితేటలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. పంట పండించడంలోనే కాదు.. టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తమకు తెలుసని నిరూపించిన ఈ అన్నదాతలను అందరూ అభినందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోళీలే ఆయుధాలు.. షాపింగ్ మాల్సే వారి టార్గెట్
కార్పొరేట్ కోటలు బద్దలు.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల ‘విజయ’ కేతనం