ప్రముఖ నటి నాదియా తన సుదీర్ఘ సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం గురించి గతంలో ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అత్తారింటికి దారేది చిత్రంలో అత్త పాత్రతో తెలుగు ప్రేక్షకులకు అత్యంత ఆప్తురాలిగా మారిన నాదియా, ఈ సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. “మిర్చి” సినిమాతో తెలుగు సినిమాలోకి తిరిగి ప్రవేశించినప్పటికీ, “అత్తారింటికి దారేది” చిత్రంలోని తన పాత్రే తెలుగు ప్రజలకు తనను మరింత చేరువ చేసిందని నాదియా అన్నారు.
“అత్తారింటికి దారేది” తర్వాత తెలుగు స్క్రీన్పై అంతగా కనిపించకపోవడానికి కారణం, ఆమె సినిమాలు ఎంచుకునే విధానమేనని వివరించారు. ఒక సినిమా తర్వాత మరో సినిమాకు మధ్య విరామం తీసుకుంటానని నాదియా చెప్పారు.”సినిమా నా అభిరుచి, కానీ నా ప్రాధాన్యత కాదు” అనే తన సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించారు. షూటింగ్ పూర్తవగానే ఇంటికి తిరిగి వెళ్లడానికి తహతహలాడతానని, తన ఇల్లు తన “లిటిల్ కకూన్” అని ఆమె పేర్కొన్నారు.
నటిగా బిజీగా ఉన్నప్పటికీ, తన స్టార్డమ్ను ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదని నాదియా వెల్లడించారు. తనకు లభించిన స్టార్డమ్ జీవితంలో ఒక పెద్ద బోనస్గా మాత్రమే భావిస్తానని, కుటుంబం, స్నేహితులతో గడిపే సమయానికే అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. సెట్లో ఉన్నప్పుడు నటిగా తన పాత్రను ఉత్తమంగా పోషించడానికి ప్రయత్నిస్తానని అన్నారు.
సెట్ నుండి బయటకు వచ్చిన తర్వాత తాను నాదియాను కాదని, తన అసలు పేరు జరీనా అని, వ్యక్తిగత జీవితంలో జరీనాగానే ఉంటానని తెలిపారు. తన వివాహం తర్వాత, తన భర్తతో కలిసి అమెరికా వెళ్లినట్లు నాదియా చెప్పారు. తాను కేవలం మూడేళ్లు (1985 నుండి 1988 వరకు) మాత్రమే చిత్ర పరిశ్రమలో ఉన్నానని, ఆ తర్వాత 15 ఏళ్ల విరామం తీసుకుని కుటుంబ జీవితంపై దృష్టి పెట్టానని చెప్పారు.
ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దయ్యాక, అప్పుడప్పుడు ఆసక్తికరమైన చిత్రాల్లో నటిస్తున్నానని, అయితే ఇంటిని వదిలి ఎక్కువ కాలం ఉండలేనని, అందుకే ఎక్కువ సినిమాలు అంగీకరించనని నాదియా అన్నారు. ముంబైలో నివసించడం వల్ల, సినిమా పరిశ్రమ నుండి దూరంగా సాధారణ జీవితాన్ని గడపడం సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు.




