Headlines

WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం.. రిటెన్షన్ డెడ్‌లైన్, ఆక్షన్ డేట్స్ ఇవే..!


భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women’s Premier League – WPL) ఐదో సీజన్ షెడ్యూల్ నేడు అంటే బుధవారం అధికారికంగా ఖరారు చేసింది. 2027 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన ప్లేయర్ల వేలం ప్రక్రియను అక్టోబర్ 28న కొచ్చి (Kochi) నగరంలో నిర్వహించనున్నారు. అయితే, మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే నగరాల వివరాలను బోర్డు ప్రస్తుతానికి వెల్లడించలేదు. మహిళల క్రికెట్‌లో అతిపెద్ద టీ20 లీగ్‌గా అవతరించిన ఈ టోర్నమెంట్, దేశ విదేశాలకు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణులతో పాటు వర్ధమాన ప్రతిభను ఒకే వేదికపైకి తెచ్చి అత్యున్నత స్థాయి ప్రదర్శన ఇచ్చేందుకు దోహదపడుతోందని బీసీసీఐ ప్రత్యేక ప్రకటనలో పేర్కొంది.

లీగ్‌లో పాల్గొనే ఐదు ఫ్రాంచైజీల కోసం బీసీసీఐ కీలక గడువును సైతం విధించింది. ప్రస్తుత జట్ల ఆధారంగా ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రక్రియకు సెప్టెంబర్ 28 తుది గడువుగా నిర్ణయించారు. రాబోయే కొత్త సీజన్ కోసం జట్ల కూర్పును పటిష్టం చేసుకునే క్రమంలో తమ పాత బృందాల్లోని క్రీడాకారిణులను రిటైన్ చేసుకునే వెసులుబాటును ఫ్రాంచైజీలకు కల్పించినట్లు బోర్డు స్పష్టం చేసింది. ఈ గడువు ముగిసిన వెంటనే ఏయే జట్లలో ఎవరెవరు మిగిలారనే అంశంపై స్పష్టత వస్తుంది.

గత 2026 ఎడిషన్ విషయానికి వస్తే, స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru – RCB) అద్భుత ప్రదర్శన కనబరిచి తమ ఖాతాలో రెండో డబ్ల్యూపీఎల్ ట్రోఫీని జమ చేసుకుంది. ఆ సీజన్ మ్యాచ్‌లను నవీ ముంబై (Navi Mumbai), బరోడా (Baroda) వేదికలుగా విజయవంతంగా నిర్వహించారు.

2023లో ప్రారంభమైన ఈ ధనాధన్ లీగ్‌లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ (Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెరో రెండు టైటిళ్లను కైవసం చేసుకుని ఆధిపత్యం చాటాయి. తాజాగా కొత్త సీజన్ షెడ్యూల్ విడుదల కావడంతో వేలంలో అత్యుత్తమ ప్లేయర్లను దక్కించుకునేందుకు అన్ని జట్ల యాజమాన్యాలు వ్యూహాలు రచిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *