హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13 (సోమవారం)తో ముగిశాయి. ఏప్రిల్ 15, 16 తేదీల్లోనూ ఓరియంటల్ పరీక్షలు ఉన్నాయి. కానీ వీటిని చాలా తక్కువ సంఖ్యలో మత్రమే విద్యార్ధులు రాస్తారు. మిగతా ప్రధాన పరీక్షలన్నీ నిన్నటితో ముగిశాయి. దీంతో మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు నెల రోజలపాటు కొనసాగి ఏప్రిల్ 13తో ముగిసినట్లైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థుల్లో 99% మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది.
ఇప్పటికే నాలుగు సబ్జెక్టుల (తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం) జవాబు పత్రాల మూల్యాంకనం సైతం పూర్తయ్యింది. స్కానింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. మిగిలిన సబ్జెక్టులకు (భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టుల మూల్యాంకనం) ఏప్రిల్ 16 లేదా అంతకంటే ముందే పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక సాంఘిక శాస్త్రం మూల్యాంకనం ఏప్రిల్ 17 నుంచి 23 తేదీల మధ్య జరగనుంది. మొత్తంగా ఏప్రిల్ 23వ తేదీ నాటికి స్పాట్ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
పరీక్షా ఫలితాల వెల్లడికి విద్యాశాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 16తో మిగిలిన ఓరియంటల్ పరీక్షలు ముగియనున్నాయి. గతేడాది ఏప్రిల్ 30వ తేదీన పదో తరగతి ఫలితాలు విడదల చేశారు. లేదంటే మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. మూల్యాంకనం ముగిసిన వెంటనే మార్కుల నమోదు ప్రక్రియను చేపట్టనున్నారు. ఏప్రిల్ 23 నాటికి స్పాట్ పూర్తి అయితే మరో వారం నుంచి 10 రోజుల పాటు క్రోడీకరణ ఉంటుంది. అంటే ఏప్రిల్ చివరికల్లా మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ ప్రకారంగా చూస్తే మే 4 లేదా 5 లేదా 6 తేదీల్లో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా విద్యాశాఖ నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు ఏపీలోనూ పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలోనే విడుదలకానున్నాయి. మూల్యాంకనం ప్రక్రియలో చోటుచేసుకున్న జాప్యం కారణంగా ఈసారి అక్కడ ఫలితాలు ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.