
దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలో గతంలో మైనర్ల ప్రేమ వ్యవహారంపై గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దల తీరును వెంకటేశ్వరరావు తప్పుబట్టారు. తమ నిర్ణయాలను విమర్శిస్తున్నాడన్న కక్షతో అదే గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు తిరువీధుల జేమ్స్, గద్దల వెంకటరమణలు బుధవారం ఉదయం వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లారు. నిందితులు ఇద్దరూ వెంకటేశ్వరరావు ఇంటిలోకి చొరబడి, ఆయన చొక్కా కాలర్ పట్టుకుని బయటకు లాక్కొచ్చారు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఆయనపై అత్యంత క్రూరంగా దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆయన బట్టలు సైతం ఊడిపోయినట్లు సమాచారం. తన తండ్రిని వదిలేయమని కుమారుడు తేజ బ్రతిమిలాడినా వినకుండా, గ్రామస్తులందరి ముందు ఆయనను అవమానపరిచారు. వృద్ధుడని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించడంతో వెంకటేశ్వరరావు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
అందరి ముందు జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన వెంకటేశ్వరరావు, బుధవారం రాత్రి తన నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన తండ్రి మరణానికి గ్రామ పెద్దల వేధింపులే కారణమని కుమారుడు తేజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రిని చిత్రహింసలకు గురిచేసి, చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన తిరువీధుల జేమ్స్, గద్దల వెంకటరమణలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, తదుపరి చర్యలు చేపట్టారు. ఈ ఘటన లచ్చాపురం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు, విషాదానికి దారితీసింది.
ఇది చదవండి: హైదరాబాద్ టూ నరసాపురం.. పాస్టర్ ఇంటికి రెండు పే..ద్ద లగేజీలు.. ఓపెన్ చేయగా