తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రైతు భరోసా పథకం ద్వారా ప్రతీ ఏడాది ఎకరానికి రూ.12 వేల చొప్పున అందిస్తున్న విషయం తెలిసిందే. వీటిని రెండు విడతలుగా అందిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి ఇటీవల వీటిని విడతల వారీగా రైతులకు అందిస్తూ వస్తోంది. మూడు విడతలుగా వీటిని పంపిణీ చేస్తోంది. తొలి విడత కింద లబ్దిదారులకు రూ.3,446 కోట్లు, రెండో విడత కింద రూ.2,206 కోట్లు జమ చేసింది. తొలి విడతలో 68,89 లక్షల మందికి లబ్ది చేకూరగా.. రెండో విడతలో 45.11 లక్షల మంది రైతులకు అందించింది.
వచ్చే నెలలో మూడో విడత
వచ్చే నెలలో మూడో విడత నిధులను లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్దమైంది. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. మూడో విడత నిధులను మే నెలాఖరుకల్లా రైతులకు అందించనున్నారు. ఇందుకోసం నిధులను ప్రభుత్వం సేకరించే పనిలో నిమగ్నమైంది. రూ.12 వేల కోట్లు సమీకరించేందుకు బాండ్లను వేలానికి పెట్టాలని రిజర్వ్ బ్యాంక్కు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వేలం ద్వారా వచ్చిన సొమ్మును రాబోయే 6 నుంచి 25 ఏళ్లల్లో చెల్లించనుందని తెలుస్తోంది. 7 నుంచి 7.5 శాతం వడ్డీకే వీటిని తీసుకోనుందని సమాచారం.అలాగే హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి నిధులు అవసరం కానున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధారిటీ ద్వారా నిధుల సమీకరణకు సిద్దమయ్యారు. రూ.15 వేల కోట్లు మెట్రో స్వాధీనానికి అవసరమవుతాయి. దీంతో రానున్న రెండు నెలల్లో రైతు భరోసా, మెట్రో స్వాధీనం, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం రూ.12 వేల కోట్లు సమీకరించేందుకు రెడీ అయింది.
కేవైేసీ తప్పనిసరి
ప్రస్తుతం యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేస్తోంది. తొలి విడతగా ఎకరం భూమికి రూ.6 వేల చొప్పున అందించారు. ఆ తర్వాత రెండో విడత కింద మరికొంత భూమికి జమ చేయగా.. మూడో విడతలో మొత్తం భూమికి అందించనుంది. ఇక రైతు భరోసా డబ్బులు పడనివారు బ్యాంక్ కేవైసీ పూర్తి చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్కు ప్రతీ ఏడాది కేవైసీ పూర్తి చేయాలి. అప్పుడే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉంటుంది. అప్పుడే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సొమ్ము డీబీటీ ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి.