భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రధాన రహదారి పక్కన ఉన్న స్థానిక వినాయక ఆలయంలో ధ్వజస్తంభాన్ని పునః ప్రతిష్టాపన చేస్తుండగా, ఒక్కసారిగా అది విరిగి పడింది. క్రేన్ సహాయంతో ప్రతిష్టాపన చేస్తున్న సమయంలో ధ్వజస్తంభం మూడు ముక్కలై కూలిపోయింది.
ఆ సమయంలో అక్కడున్న భక్తులపై నేరుగా పడే పరిస్థితి ఏర్పడినా, వారు అప్రమత్తంగా తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఒక యువతి తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ నిర్వాహకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.