ఆయన జనంలోకి వచ్చినా వార్తే.. ఇంట్లో కూర్చున్నా వార్తే.. మాట్లాడినా సంచలనమే.. మౌనంగా ఉన్నా సంచలనమే.. అధికారం కోల్పోయాక .. అప్పుడప్పుడూ తప్ప పెద్దగా బయట కనిపించని కేసీఆర్ గురించి.. రెండున్నరేళ్లుగా ఇదే టాక్ నడుస్తోంది. అప్పుడెప్పుడో BRS రజతోత్సవ సభలో దర్శనమిచ్చిన కేసీఆర్… అడపాదడపా అగుపించినా ప్రజాక్షేత్రంలోకి మాత్రం పూర్తిస్థాయిలో రాలేదు.. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభతో ఆయన మరోసారి… జనంలోకి వస్తుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలని షేక్ చేస్తోంది.
అందులోనూ… కాంగ్రెస్తో 40ఏళ్ల జర్నీకి పుల్స్టాప్ పెట్టేసి.. మాజీ మంత్రి జీవన్రెడ్డి BRSలో చేరుతున్న సందర్భంలో ఏర్పాటు చేస్తున్న భారీ చేరిక సభ ఇది. ఒకరకంగా చెప్పాలంటే.. ఉత్తర తెలంగాణలో కారు పార్టీకి ఊపు తీసుకొచ్చే మీటింగ్గా గులాబీ శ్రేణులు చెప్పుకొంటున్నాయి. అందుకే తమ బాస్ మాస్ఎంట్రీ ఎలా ఉంటుంది? ఏం మాట్లాడుతారు? ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారనే ఆసక్తితో ఉంది బీఆర్ఎస్ క్యాడర్..
కరీంనగర్తో కేసీఆర్కు ఉద్యమపరంగా, పొలిటికల్గా విడదీయలేని ఒక పొలిటికల్ ఎమోషనల్ బాండ్ ఉంది. సింహగర్జనతో మలిదశ ఉద్యమానికి ఇక్కణ్నుంచే సమరశంఖం పూరించిన కేసీఆర్… స్వరాష్ట్ర పోరాటాన్ని దూకుడుగా ముందుకు నడిపారు. 2004లో కరీంనగర్ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన కేసీఆర్… ఐదేళ్ల టర్మ్లో రెండు ఉప ఎన్నికలు ఎదుర్కొని ఉద్యమానికి ఊపు తీసుకొచ్చారు. అయితే, నాడు KCRతో ప్రత్యర్థిగా తలపడిన జీవన్రెడ్డి… నేడు బీఆర్ఎస్లో చేరుతుండటమే పొలిటికల్ ఆసక్తిరేపుతున్న అంశం.. మరోసారి KCR ఇలాఖాలోని జగిత్యాల నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవుతుందంటోంది BRS. ఉత్తర తెలంగాణలో కారు స్పీడును టాప్గేర్లో తీసుకెళ్తుందని చెప్పుకుంటోంది. రాష్ట్ర రాజకీయాల్లోనూ ఈ మీటింగ్ భారీ మార్పులు తీసుకొస్తుందనే చర్చ మొదలెట్టింది.
అయితే, ఈ మీటింగ్ ద్వారా పార్టీకి, ప్రజలకు కేసీఆర్ ఇచ్చే సందేశం ఏంటి? డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై గులాబీ బాస్ స్పందిస్తారా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లూ కాళేశ్వరంపై ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు కరెక్టుగా ఇదే సమయంలో మేడిగడ్డ రిపేరుకు పూనుకోవడం… పొలిటికల్గా చర్చనీయాంశమైంది. జగిత్యాల సభలో కేసీఆర్ ఈ విషయమై స్పందిస్తారా? అన్నది కూడా కీలకంగా మారింది.