Headlines

Hyderabad: 48 గంటల్లో హత్య కేసును చేధించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు.. ఎలా అంటే?


రంగా రెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస నేరాల గుట్టును పోలీసులు మట్టుబెట్టారు. అలీనగర్‌లో తీవ్ర కలకలం రేపిన ఆటో డ్రైవర్ హత్య కేసుతో పాటు, కాటేదాన్‌లోని హర్ష్ బేకర్స్ లో జరిగిన భారీ నగదు చోరీ కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. రెండు వేర్వేరు కేసుల్లో కీలక పురోగతి సాధించిన పోలీసులు, ప్రధాన నిందితులతో పాటు వారి సహచరులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసులకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 2వ తేదీ రాత్రి అలీనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అబ్దుల్ రౌఫ్‌ను ముగ్గురు వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. పాత కక్షలే ఈ హత్యకు ప్రధాన కారణమని విచారణలో తేలింది. ప్రధాన నిందితుడైన మహ్మద్ జావిద్, తన తమ్ముడు సాజిద్ మరణానికి అబ్దుల్ రౌఫే కారణమని తీవ్రంగా నమ్మి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా రౌఫ్‌ను అంతమొందించాలని పథకం రచించిన జావిద్, తన స్నేహితులు మహ్మద్ అబ్దుల్లా, మహ్మద్ ఆరిఫ్‌లతో కలిసి స్కెచ్ వేశాడు. రౌఫ్ ఆటోలో వెళ్తుండగా కాపుకాచి అడ్డుకున్న నిందితులు, మొదట అతడి కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి స్పృహ తప్పేలా చేశారు. అనంతరం వెంట తెచ్చుకున్న వేటకత్తులతో దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. హత్య అనంతరం నిందితులు పల్లెచెరువు సమీపంలోని పొదల్లో కత్తులు, రక్తపు మరకలు ఉన్న దుస్తులు పడేసి పరారయ్యారు.

ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సెప్టెంబర్ 4న తెల్లవారుజామున ఆరాంఘర్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో యాక్టివా బైక్‌పై కర్ణాటక వైపు పారిపోతున్న ముగ్గురు నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన మూడు కత్తులు, రెండు పెప్పర్ స్ప్రేలు, మొబైల్ ఫోన్లు, యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో కాటేదాన్ హర్ష్ బేకర్స్ చోరీ కేసులోనూ నిందితులను అరెస్ట్ చేసి, రికవరీ సాధించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం చేసి, నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఐ వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *